calender_icon.png 12 October, 2024 | 6:54 AM

ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 18 శాతం వృద్ధి

12-10-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్ 10 వరకూ దేశంలో నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 18.3 శాతం వృద్ధిచెంది రూ.11.25 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్ళు రూ.5.98 లక్షల కోట్లుకాగా, కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.4.94 లక్షల కోట్లు. సెక్యూరిటీల లావాదేవీ పన్నులు (ఎస్‌టీటీ) రూ.30,630 కోట్ల మేర వసూలయ్యాయి.

గిఫ్ట్ ట్యాక్స్‌తో సహా ఇతర పన్నులు రూ.2,150 కోట్లు వచ్చాయి. నిరుడు ఇదేకాలంలో రూ.9.51 లక్షల కోట్ల నికర ప్రత్యక్ష పన్నులు వసూలయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 10 వరకూ  స్థూల ప్రత్యక్ష పన్నులు వసూళ్లు 22.3 శాతం వృద్ధితో రూ.13.57 లక్షల కోట్లకు చేరగా, రూ.2.31 లక్షల కోట్ల రిఫండ్స్ జారీచేసింది. గత ఏడాదితో పోలిస్తే రిఫండ్స్ 46 శాతం పెరిగాయి.