08-02-2025 11:59:33 PM
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి...
రంగారెడ్డి (విజయక్రాంతి): ప్రజలు సహకారం అందిస్తే ఆమనగల్లు మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తనవంతు సహకారం ఉంటుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హామనిచ్చారు. శనివారం ఆమనగల్లు మున్సిపాలిటీలో తాసీల్దార్లు లలిత, ముంతాజ్, ఎంపీడీవో కుసుమ మాధురి, సుజాత, ఆర్అండ్బి డీఈ రవీందర్ ఎఈ రవితేజ మున్సిపాలిటీ కమీషనర్ శంకర్నాయక్, మార్కెట్ చైర్పర్సన్ యాటగీత, వైస్ చైర్మన్ భాస్కర్రెడ్డి, స్థానిక ప్రజలతో కలిసి పలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఆమనగల్లు నాలుగు మండలాలకు ముఖ్య కేంద్రంగా ఉందని ఈ ప్రాంతాన్ని రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకుల సహకారం లేకపోవడంతో అభివృద్ధిపనులు నత్త నడకన కొన సాగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
దేవరకొండ షాద్నగర్ ప్రధాన రహదారి రోడ్ల విస్తరణ పనులు త్వరతిగతిన పూర్తి చేయాలన్నారు. అందుకోసం పట్టణంలో ఇరువైపుల 30 ఫీట్ల రోడ్లను విస్తరించడం వల్ల 75 శాతం ఇళ్లు పూర్తిగా తొలగించాల్సి వస్తుందని బాధితులకందరికి ప్రభుత్వ పరంగా నష్టపరిహారంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజురూ చేసి వారికి అండగా ఉంటానన్నారు. పట్టణంలో స్కిల్ డెవలప్మెంట్, ట్రామా కేంద్రాలు ఏర్పాటు కోసం తాసీల్దార్ కార్యాలయం వెనుకవైపు ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. అనంతరం మున్సిపాలిటీని సందర్శించి పలు అభివృద్ధి సంక్షేమ పథకాలపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అక్కడినుంచి కడ్తాల మండలంలో ఎస్సీ సబ్ప్లాన్కింద మంజూరైన రూ.35 లక్షల సీసీరోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అర్హులైన అందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని ఆయన ప్రతిపక్షాల మాయమాటలకు ప్రజలేవరూ మోసపోద్దని ఆయన హితవు పలికారు.