శాసనమండలి బీఆర్ఎస్ పక్షనేత మధుసూదనచారి
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): హైడ్రా చర్యలతో కొన్ని రోజులుగా మహానగరంలో ప్రజలు హాహాకారాలు చేస్తున్నారని బీఆర్ఎస్ శాసనమండలి పక్షనేత మధుసూదనాచారి పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా హాల్లో మాట్లాడుతూ.. హైడ్రాకు కర్త, కర్మ, క్రియ సీఎం రేవంత్ రెడ్డినన్నారు.
పది నెలలుగా రాష్ర్టంలో పాలన పడకేసిందని, ఆరు గ్యారంటీలు, రైతు రుణ మాఫీపై ఏం చెప్పుకోలేని స్థితి ప్రభుత్వం ఉండడం వల్లే హైడ్రా పేరుతో డ్రామాలు ఆడుతుందన్నారు. అందరూ హైడ్రా చర్య లను వ్యతిరేకిస్తున్నారని, హైకోర్టు కూడా హైడ్రా దూకుడును తప్పు పట్టిందన్నారు. కేసీఆర్ను తిట్టడం తప్ప రేవంత్ చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్ పాలనను ప్రజలు మరోమారు గుర్తు తెచ్చుకుంటున్నారని, రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కూల్చివేతలు ఆపి ప్రజలకిచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని సూచించారు.