25-03-2025 12:00:00 AM
గజ్వేల్, మార్చి 24: రేవంత్రెడ్డి పాలనలో ప్రజలు అల్లాడుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడా రు. కేసీఆర్కు గజ్వేల్తో ఉన్నది తల్లీ పిల్లల పేగుబంధం అని అభివర్ణించారు. తెలంగాణలో ఇతర పట్టణాలకు ఆదర్శంగా గజ్వేల్ను తీర్చిదిద్దారని గుర్తు చేశారు.
గత కాంగ్రెస్ పాలనలో నీటి కరువుతో గజ్వేల్ ఆడపడుచులు, రైతులు ఇబ్బందులకు గురయ్యారని కేసీఆర్ వచ్చిన తర్వాత మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వం మిషన్ భగీరథ నీళ్లకు కోత పెట్టిందని విమర్శించారు. కేసీఆర్ కృషితో మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్లతో ధాన్యలక్ష్మి తాండవం చేస్తుందన్నారు.
కాంగ్రెస్ పాలన వల్ల గజ్వేల్లో ధనలక్ష్మి మాయమైపోతున్నదని, భూముల ధరలు పడిపోతున్నాయ న్నారు. గజ్వేల్ను ఎడ్యుకేషన్ హబ్గా మార్చింది కేసీఆర్ అని గుర్తు చేశారు. గజ్వేల్ రోడ్డులో 3 కిలో మీటర్లకు 36 గుంతలు ఉండేవని, కేసీఆర్ దాన్ని నాలుగు లేన్ల రహదారిని చేశారన్నారు. రేవంత్ పాలనలో గజ్వేల్కు ఒక్క రూపాయి కూడా పని చేయలేదన్నారు.
కేసీఆర్ మంజూరు చేసిన టెండర్లకు సంబంధించి రూ.181 కోట్ల పనులు రేవంత్రెడ్డి రద్దు చేశారని విమర్శించారు. 15 నెలల పాలనలో గజ్వేల్కు ఇచ్చిందేమీ లేదన్నారు. గజ్వేల్పై నిజమైన ప్రేమ ఉంటే రద్దు చేసిన రూ.181 కోట్ల పనులను పునరుద్ధరించాలని కోరారు.
మల్లన్నసాగర్ నిర్వాసితులు 90 శాతం మందికి రూ.1,260 కోట్లు కేసీఆర్ ఇచ్చారని, 10 శాతం మిగిలిపోయిన వారికి రూ.200 కోట్ల నిధులు విడుదల చేయాలన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితుల కోసం అసెంబ్లీలో 26వ తేదీన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.
మీడియా సమావే శంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి పాల్గొన్నారు.