25-04-2025 11:46:59 PM
ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిత్...
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పెండింగ్లో ఉన్న పెన్షన్, జీపీఎఫ్ ఫైనల్ విత్డ్రాల్ కేసుల సత్వర పరిష్కారానికి పెన్షన్ అదాలత్ నిర్వహించి సమస్యను పరిష్కరిస్తున్నామని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఆఫ్ తెలంగాణ చందా పండిత్ పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పెన్షన్ అదాలత్ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చందా పండిత్ మాట్లాడుతూ.... పెన్షన్ డిజిటలైజేషన్ ప్రక్రియ ఆరు నెలల్లో పూర్తి కానుందని, ఆ దిశగా పదవి విరమణ పొందిన ఉద్యోగులు పెన్షన్లు, జీపీఎఫ్ అందజేతలో సందేహాలుంటే పెన్షన్ అదాలత్లో నివృత్తి చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ పెన్షన్, ప్రభుత్వ ఉద్యోగుల హక్కు అని, పదవీ విరమణ పొందిన రోజే ఆ ఉద్యోగులకు పెన్షన్ అందేలా చూడాలన్నారు. అనంతరం పలువురికి పెన్షన్ మంజూరు పత్రాలు అందజేశారు. సమావేశంలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ అభయ్ సోనార్కర్, జేడీ ప్రావీణ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.