calender_icon.png 30 April, 2025 | 6:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ వేతనాలను విడుదల చేయాలి

30-04-2025 12:41:00 AM

అదనపు కలెక్టర్ కు ఈజీఎస్ ఉద్యోగులు విజ్ఞప్తి

పాపన్నపేట, ఏప్రిల్ 29 :ప్రభుత్వం ఈజీఎస్ ఉద్యోగులకు పెస్కేల్ అమలు చేస్తానని చేసిన వాగ్దానం ప్రకారం  వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా గత మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను తక్షణం విడుదల చేయాలని కోరుతూ పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ కు ఈజీఏస్ ఉద్యోగుల జేఏసీ అందజేసింది.

ఈ సందర్బంగా జిల్లా జేఏసీ చైర్మన్ రాజ్ కుమార్ మాట్లాడుతూ గత మూడు నెలల నుండి వేతనాలు లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడం లో మా వంతు పూర్తి సహకారం అందించడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్లలో ఈజీఎస్ ఉద్యోగులకు పే స్కేలు అమలు చేస్తామని ప్రకటించినా అది ఇప్పటికే కార్యరూపం దాల్చకపోవడం విచారకరమన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చేసిన వాగ్దానం మేరకు ఉపాధి ఉద్యోగులందరికీ పేస్కేల్ అమలుతోపాటు పెండింగ్లో ఉన్నటువంటి మూడు నెలల వేతనాలను తక్షణం విడుదల చేయాలని అన్నారు. లేనిచో రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు సమ్మె కార్యాచరణను అమలు చేయడం జరుగుతుందని అధికారులకు సూచించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపిఓలు మహిపాల్ రెడ్డి, శ్యామ్ కుమార్, శంకర్, పౌల్, ఈసీ లు భగవాన్ రెడ్డి వేణు, కృష్ణ, టీఏల సంఘం జిల్లా అధ్యక్షులు రాజేశ్వర్, సీఓ ల సంఘం రాష్ట్ర నాయకులు రాము, జేఏసీ ప్రతినిధులు శశిరేఖ, స్వప్న, బాలరాజ్, అనిల్, సంతోష్ తో పాటు ఇతరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా గ్రామీణభివృద్ధి అధికారికి సైతం వినతిపత్రంఅందజేశారు.