28-03-2025 06:31:01 PM
హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్
హుజురాబాద్,(విజయక్రాంతి): భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వమని, దేశంలోని విభిన్న కులాలు, మతాలవారు రాబోయే పండుగలు కుల మతాలకు అతీతంగా స్నేహపూర్వకమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్(Huzurabad ACP Srinivas) విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని శుక్రవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించి పీస్ కమిటీ సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ... రాబోయే ఉగాది, రంజాన్, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, పండుగలు ప్రజలంతా కలిసిమెలిసి నిర్వహించుకోవాలని సూచించారు.
హుజరాబాద్ డివిజన్ లో ప్రజలు పండుగలను కుల మతాలకు అతీతంగా జరుపుకుంటూ పలువురికి ఆదర్శంగా నిలవాలన్నారు. గతంలో మాదిరిగానే కుల మతాలతో సంబంధం లేకుండా పండుగలు జరుపుకోవాలని అన్నారు. పండుగల సమయంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. పండుగల సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పలు ప్రాంతాలలో పోలీస్ బందోబస్తు ఉంటుందని . ప్రజలకు పోలీసు సహాయ సహకారాలు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ సిఐ తిరుమల్ గౌడ్, పీస్ కమిటీ సభ్యులతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.