17-12-2024 02:03:19 AM
* మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే తాట తీస్తాం
* పీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్కౌశిక్ యాదవ్
హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి ) : పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్కౌశిక్ యాదవ్ అన్నారు. గాంధీభవన్లో సోమవారం పీసీసీ అధికార ప్రతినిధి లింగంయాదవ్, పార్టీ నేతలు యోగేశ్వర్రెడ్డి, రవిచంద్ర, జగదీశ్తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. మహేశ్కుమార్గౌడ్ డమ్మీ కాదు.. డైనమిక్ అని, పప్పెట్ కాదు పనిమంతుడని, అందుకే పీసీసీ అధ్యక్షుడు అయ్యాడని స్పష్టం చేశారు.
బీసీని పీసీసీ చీఫ్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు. కేసీఆర్ హయాంలో బీసీలకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించని వారు తమ పార్టీ అధ్యక్షుడిపై విమర్శలు చేయడమేంటని ఆయన మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతానికి కుదించినప్పుడు మీరంతా ఎక్కడికి పోయారని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ హయాంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్ను ప్రగతిభవన్కు రానివ్వకుండా అవమానించినప్పుడు కేసీఆర్ను ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. పీసీసీ చీఫ్పై మరోసారి అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే తాట తీస్తామని ఆయన హెచ్చరించారు.