అమరావతి: తిరుపతి లడ్డూలు, భారతదేశంలోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించడానికి జాతీయ స్థాయిలో ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ని ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంశంపై పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. లడ్డూలో జంతువుల కొవ్వులు కలిసినట్లు తెలిసిందని పవన్ అన్నారు. లడ్డూ కల్తీ నెయ్యి అంశం తెలిసి తీవ్ర కలత చెందానని ఆయన పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. వైసీపీ హయాంలోని టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు జవాబు చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. ఆలయాలపై జాతీయస్థాయి విధానం అవసరం, ఆలయాల రక్షణకు జాతీయస్థాయిలో చర్చ జరగాలని పవన్ కళ్యాణ్ అన్నారు. మతాధిపతులు, న్యాయనిపుణులు, అన్ని వర్గాల ప్రతినిధులతో చర్చించాలన్నారు.