మహావికాస్ అఘాడీలో విభేదాలను తగ్గించిన ఎన్సీపీ అధినేత!
ముంబై, అక్టోబర్ 28: భవిష్యత్ ఎన్నికలు గేమ్ చేంజర్గా అభివర్ణిస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ బరిలో నిలిచే అభ్యర్థులకు పార్టీ టికెట్ దక్కుతుందా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. షిండే ప్రభత్వాన్ని కూలగొ ట్టడమే లక్ష్యంగా ఏకతాటిపైకి వచ్చిన మహా వికాస్ అఘాడీలోని కాంగ్రెస్, శివసేన(యూబీటీ), ఎన్సీపీ మధ్య సీట్ల పంపకాలు కొలిక్కి వచ్చాయి. సీట్ల సర్దుబాటులో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కీలక పాత్ర పోషించారు. శివసేన(యూబీటీ), కాంగ్రెస్ మధ్య సర్దుబాటు విషయమై పోరు నెలకొన్న నేపథ్యంలో పవార్ తన చాణక్యంతో సమానంగా సీట్ల కేటాయింపు అంశం తెరపైకి తేవడంతో వివాదాలన్నిటికి ఫుల్స్టాప్ పెట్టినట్లుంది.
సమానంగా సీట్ల పంపకం..
మొత్తం 288 అసెంబ్లీ సీట్లున్న మహారాష్ట్రలో.. 85 చొప్పున మహావికాస్ అఘాడీలోని కాంగ్రెస్, శివసేన(యూబీటీ), ఎన్సీపీ పార్టీలు తమ అభ్యర్థులను బరిలో నిలపనున్నాయి. మిగితా స్థానాలపై ఎటూ తేల్చ లేదు. తమతో కలిసి వచ్చే చిన్న పార్టీలకు సీట్ల ను కేటాయించేందుకుగాను స్పేర్లో ఉంచినట్లు సమాచారం. 2024 లోక్సభ ఎన్నికల్లో సత్తాచాటిన ఎన్సీపీ.. దానిని ఈ ఎన్నికల్లో తనకు అనుకూలంగా మార్చుకుంటుందనే చర్చ జోరుగా నడుస్తోంది. కాంగ్రెస్తో సమానంగా సీట్లు పొందిన ఎన్సీపీ.. ఆ పార్టీ సీనియర్ నేత, అధ్యక్షుడు శరద్పవార్ చాణక్యాన్ని మెచ్చుకోక తప్పని పరిస్థితి.