కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలకలం
కామారెడ్డి ( విజయ క్రాంతి): చికిత్స కోసం వచ్చిన ఒక రోగి ప్రైవేట్ ఆసుపత్రిలోని బాత్రూంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రానికి చెందిన సాయిలు (38) కు చేతికి గాయం కావడంతో ఇన్ఫెక్షన్ అయింది. కుటుంబ సభ్యులు సాయిలుని చికిత్స నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి లో చేర్పించారు. చికిత్స పొందుతున్న సాయిలు తన చేయికి ఇన్ఫెక్షన్ తగ్గదేమోననీ కలత చెంది ఆస్పత్రిలోని బాత్రూంకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సాయిలు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు కామారెడ్డి పోలీసులు తెలిపారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలకలం రేపింది.