ఆదిలాబాద్, (విజయక్రాంతి) : క్రీడాకారులు గెలుపే లక్ష్యంగా క్రీడల్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాలని ఆదిలాబాద్ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలురి గోవర్ధన్ రెడ్డి సూచించారు. ఆదిలాబాద్లో సీనియర్స్ హాకీ శిక్షణ శిబిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం క్రీడాకారులను పరిచయం చేసుకొని శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ మేరకు గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. అక్టోబర్ 15 నుంచి హైదరాబాద్లో జరగనున్న సీనియర్స్ హాకీ టోర్నమెంట్లో పాల్గొనే జిల్లా జట్టుకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లా హాకీ క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరుస్తున్నారని, ఇటీవల జరిగిన కొన్ని టోర్నమెంట్లు మాత్రమే వెనుకబడ్డారని గుర్తు చేశారు. ఆదిలాబాద్ కు ఖేలో ఇండియా మంజూరైనందున క్రీడాకారులు వీటిని సద్వినియోగం చేసుకొని క్రీడల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, పిఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.