13-03-2025 12:01:20 AM
పాపన్నపేట, మార్చి 12: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన గ్రూప్-2 ఫలితాలలో మండలంలో ఇద్దరు అభ్యర్థులు సత్తా చాటారు. మండల పరిధిలోని అబ్లాపూర్ గ్రామానికి చెందిన బాయికాడ సుష్మిత గ్రూప్ 2 ఫలితాల్లో మహిళా విభాగంలో రాష్ట్రస్థాయిలో 406 మార్కులు సాధించి రెండవ స్థానాన్ని పొందింది. సుస్మిత ప్రస్తుతం కొల్చారం గురుకుల పాఠశాలలో గణిత అధ్యాపకురాలిగా పనిచేస్తుంది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త ప్రోత్సాహంతోనే తాను గ్రూప్ 2 ఫలితాల్లో విజయకేతనం ఎగురవేశానన్నారు. అలాగే గ్రూప్ 1లో సైతం 401 మార్కులు పొందినట్లు తెలిపారు. అలాగే మండల కేంద్రమైన పాపన్నపేటకు చెందిన అర్జున్ రెడ్డి 413.89 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 18వ ర్యాంకులో నిలిచాడు. అర్జున్ రెడ్డి ప్రస్తుతం హవేలీ ఘనపురం మండలం రెవెన్యూ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు.
తమ కుటుంబ సభ్యులందరూ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు చేస్తున్నందున పట్టుదలతో చదివి గ్రూప్స్ సాధించినట్లు ఆయన తెలిపారు. మండలంలోని ఇద్దరు తమ ప్రతిభని చాటి ఉన్నత పదవులు సాధించడం పట్ల కుటుంబ సభ్యులు,గ్రామస్తులు వారు ఇరువురికి అభినందనలు తెలియజేస్తున్నారు. ఉద్యోగ ప్రయాణంలో సైతం అంకితభావంతో పనిచేసి కుటుంబానికి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని పలువురుఅభిప్రాయపడ్డారు.