calender_icon.png 28 October, 2024 | 5:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ పాలనలో పంచాయతీలు నిర్వీర్యం

28-10-2024 02:50:49 PM

మానకొండూర్ (విజయక్రాంతి): బీఆర్ఎస్ పాలనలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మార్నింగ్ వాక్ లో భాగంగా సోమవారం మానకొండూర్ మండలంలోని ఊటూరు గ్రామ సందర్శనకు విచ్చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని వివిధ వార్డులు, కాలనీల్లో పర్యటిస్తూ గ్రామస్తులతో ముచ్చటించారు. రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీలను బలోపేతానికి పాటుపడక పోవడం వల్ల పంచాయతీల ప్రగతి కుంటుపడిందన్నారు.

పదేళ్లు గ్రామాల అభివృద్ధి, ప్రజల సమస్యలను ఏ మాత్రం పట్టించుకోకుండా నిద్రపోయిన గులాబీ నేతలు ఇప్పుడు సమస్యల గురించి వల్లవేయడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఊటూర్ స్కూల్ లో అనేక సమస్యలు నెలకొని ఉన్నప్పటికీ తన దృష్టకి ఎందుకు తీసుకు రాలేదని ఆ గ్రామ పెద్దలను ప్రశ్నించారు. సమస్యలను ప్రత్యక్షంగా చూసేందుకు ఒక్కసారైనా స్కూల్ రమ్మని పిలవలేదన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను సమకూర్చడం, భవిష్యత్ తరాల కోసం పాఠశాలలను అభివృద్ధి పర్చడమే కాకుండా వాటిని అద్భుతంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామంలో ఇళ్లు లేని నిరుపేదలకు గృహాలు మంజూరు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్. వైస్ చైర్మన్ రామిడి తిరుమల్ రెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సంపత్ గౌడ్, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు బొంగోని సునీల్, పార్టీ నాయకులు గోపు శ్రీనివాస్ రెడ్డి, ఆర్.శ్రీనివాస్ రెడ్డి, పల్లె సత్యనారాయణ రెడ్డి, కనుకం సంపత్, దొమ్మాటి మల్లేష్, రామగిరి మల్లేష్, శివారెడ్డి, వి.శంకర్, కనుకుంట్ల నర్సయ్య, జంగ శ్రీధర్, కె.భూంరెడ్డి, ఎం.శంకర్, ఎం.శ్రీనివాస్, డి.రాజేశం, ఎం సదయ్య,కె.గణపతి, పి.మల్లేశం తదితరులు పాల్గొన్నారు.