30-03-2025 04:45:49 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ, పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని(Panchanga Sravanam 2025) రవీంద్ర భారతిలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక గొప్ప నమూనా నగరంగా ‘ఫ్యూచర్ సిటీ’ని నిర్మించి, తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలబెట్టాలన్న సంకల్పంతో పని చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేవలం జనావాస యోగ్యమైన నగరంగా కాకుండా వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి, అన్ని వర్గాల యువతకు లక్షలాదిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ‘ఫ్యూచర్ సిటీ’కి ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు.
“స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి చండీగఢ్ తప్ప సంపూర్ణమైన నగర నిర్మాణం దేశంలో ఎక్కడా జరగలేదని, ఉన్న నగరాలే కాస్త విస్తరించబడ్డాయని తెలిపారు. నగరాల విస్తరణ అస్తవ్యస్తంగా మారడం వల్ల ప్రపంచంలో వెనుకబడిన దేశంగా భారత్ ఉండిపోయిందన్నారు. దేశంలో కొత్త నగరాల నిర్మాణం జరగాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ (#Telangana Rising) దేశానికి ఆదర్శంగా నిలబెట్టి ప్రజలకు ఆదర్శంగా ఉండే విధంగా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తేవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. దాంట్లో భాగంగానే మూసీ ప్రక్షాళన, రీజినల్ రింగ్ రోడ్డు వంటి ప్రాజెక్టులతో పాటు నగరానికి ఒక కొత్త ఫ్యూచర్ సిటీని నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిందని చెప్పారు.
వేద పండుతులు పంచాంగ పఠనం విన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ గుర్తొచ్చిందని, బడ్జెట్ కూడా షడ్రుచులతో కూడుకుని ఉందన్నారు. బడ్జెట్ లో కొన్ని నియంత్రణలు పాటించి చాలా అంశాల్లో ఉదారంగా ముందుకొచ్చారు. భట్టి విక్రమార్కతో కలిసి జోడెద్దుల్లా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంవైపు నడిపించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నామన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, రైతులు పండించిన పంటకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ గిట్టుబాట ధరలతో వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, పేదలకు వైద్యం అందించాలని, నిరుపేదలకు విద్యను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ఆ రంగాలకు అధిక నిధులు కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే పెట్టుబడులు రావాలని, శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అమలు కావాలని, అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆ దిశగా నిరంతరం ప్రయత్నం జరుగుతూనే ఉంటుందన్నారు.
ఒకప్పుడు పేదవాడు పండుగ పూట మాత్రమే తెల్లన్నం తినే వారు. మొట్టమొదట కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ. 1.90 లకే కిలో బియ్యం పథకాన్ని, ఆ తర్వాత ఎన్టీ రామారావు రూ. 2 లకే కిలోబియ్యం పథకాన్ని తీసుకోచ్చారని గుర్తు చేశారు. ఆ తర్వాత దేశంలో ఆహార భద్రతా చట్టం తేవడం వంటి కార్యక్రమాలతో పేదవారి ఆకలిని దూరం చేసే దిశగా ప్రయాణం జరుగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. శ్రీమంతులు తిన్నట్టుగా సన్నబియ్యం నిరుపేదలు కూడా తినాలనే ఉద్ధేశ్యంతో తెలంగాణలో సన్నబియ్యం అత్యధికంగా పండించే దిశగా ప్రభుత్వం గిట్టుబాటు ధరలతో పాటు బోనస్ ఇస్తూ రైతన్నలను ప్రోత్సహిస్తుందన్నారు. గతేడాది దేశంలోనే అత్యధికంగా వరి ధాన్యం ఉత్పత్తి సాధించుకున్నామని, ఈ సీజన్ లో కూడా రైతులు వరి ధాన్యం అత్యధికంగా పండిస్తున్నారని చెప్పారు. రైతులు పండించిన సన్న బియ్యాన్ని పేదలకు పంచాలన్న ఒక గొప్ప లక్ష్యంతో ఈ ఉగాది పండుగ పేదవారి ఇళ్లల్లో సంతోషాన్ని తెచ్చిపెట్టాలని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పథకాన్ని ప్రారంభిస్తున్నామని హర్షం వ్యక్యం చేశారు.
తెలంగాణకు మంచి భవిష్యత్తు ఉన్నదని, వేద పండితులు చెప్పినట్టుగా రాష్ట్రాభివృద్ధికి మంచి నిర్ణయాలు తీసుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజ్యాంగబద్ధమైన సంస్థలతో మంచి వాతావరణంలో అందరి సహకారంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. తమ సంకల్పంలో, ఆలోచనల్లో స్పష్టత ఉందని, సంకల్ప బలం ఉంటే దేవుడు కూడా కరుణిస్తారు. “తెలంగాణ రైజింగ్ 2050”ప్రణాళికతో దేశంలోనే రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా ఒక అద్భుతమైన అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీసుకెళ్లాలని సంకల్పించామని అభిప్రాయపడ్డారు. అందరి ఆశీర్వాదాలతో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలబెడుతామని ముఖ్యమంత్రి చెబుతూ ఈ సందర్భంగా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.