calender_icon.png 24 October, 2024 | 5:17 PM

మహా పాదయాత్రను విజయవంతం చేయాలి

24-10-2024 03:39:47 PM

మందమర్రి,(విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ దళితుల ఐక్యత కోసం భద్రాచలం నుండి హైదరాబాద్ వరకు ఈనెల 25 నుండి డిసెంబర్ 1వరకు  మాలల మహా పాదయాత్ర నిర్వహించనున్నారు. అయితే ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని జాతీయ మాల మహానాడు మండల అధ్యక్షులు ఈద లింగయ్య కోరారు. గురువారం మండలంలోని వెంకటాపూర్ గ్రామ పంచాయతీలో మహా పాదయాత్ర కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈద లింగయ్య మాట్లాడుతూ... దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గత ఆగస్టులో ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ తీర్పు అంబేద్కర్ ఆశయాలకు గొడ్డలి పెట్టువంటిదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ రాష్ట్రాల పరిధిలో చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మాలల జనాభా తక్కువని ఆశాస్త్రీయ అసంబద్ధ లెక్కలు చూపిస్తూ రాజకీయ పార్టీలను, ప్రభుత్వాలను ఒక వర్గం వారు బ్లాక్ మెయిల్ చేస్తూ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండి పడ్డారు. దేశంలోని మనువాదులు కలిసి దళితులను విభజించాలని చూడడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని దీనిని ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని ఈద లింగయ్య కోరారు. మండలంలోని మాల సోదరులు ఈనెల 25 నుండి చేపట్టనున్న మహా పాదయాత్రలో మాలలు, అనుబంధ కులాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆశ భావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల ఉపాధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, కార్యదర్శి భోగే రాజన్న, మాసు కిరణ్, పైడిమల్ల లింగయ్య, భీమయ్య, వెంకటేశం, హరికృష్ణ, సాయికుమార్ లు పాల్గొన్నారు.