calender_icon.png 22 September, 2024 | 4:52 AM

పాలేరు ఎడమ కాల్వకు మళ్లీ బుంగ

22-09-2024 02:52:27 AM

కూసుమంచి, సెప్టెంబర్ 21: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు ఎడమ కాల్వకు శనివారం మళ్లీ బుంగ పడింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదతో కాల్వకు గండి పడిన సంగతి తెలిసిందే. ఆ గండిని రెండు రోజుల క్రితమే పూడ్చివేశారు. పనుల్లో నాణ్యత లోపించడంతోనే గండి పడిన ప్రదేశంలోనే మళ్లీ బుంగ పడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బుంగ పడటంతో లక్షలాది రూపాయలు నీటి పాలయ్యాయి. పనులు నిర్వహించిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని స్థానికులు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

గతంలో గండి పడటంతో సాగునీరందక ఇప్పటికీ కాల్వ పరిధిలోని మండలాల్లో పెద్ద ఎత్తున పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం బుంగ పడటంతో కాల్వకు నీటి విడుదలను అధికారులు నిలిపేశారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాలతో బుంగ పూడ్చివేతకు చర్యలు తీసుకున్నారు.