calender_icon.png 7 February, 2025 | 7:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వలేం

07-02-2025 01:22:21 AM

పార్లమెంట్‌లో స్పష్టం చేసిన కేంద్రం 

హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాం తి): పాలమూరు  రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (పీఆర్‌ఎల్‌ఐఎస్)కు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో తేల్చిచెప్పింది. ఎంపీ బలరాం నాయక్ అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో గురువారం కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌భూషణ్ చౌదరి లిఖిత పూర్వకంగా సమాధా నమిచ్చారు.

పీఆర్‌ఎల్‌ఐఎస్‌కు జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోందని, ఈ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ టెక్నో ఎకనామిక్ అప్రైజల్ ఇవ్వాల్సి ఉందని తెలిపారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అడ్వుజరీ కమిటీ అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్ట్‌కు టెక్నో- ఎకనామికల్ అనుమతుల కోసం 2022,సెప్టెంబర్‌లో తెలంగాణ నీటిపారుదల శాఖ డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకి సమర్పించిందని తెలిపారు. పీఆర్‌ఎల్‌ఐఎస్‌ను తెలంగాణ కృష్ణా నదీ జలాలపై తలపెట్టిందని అన్నారు.

కృష్ణానది జలాల కేటాయింపు వివాదాలను పరిష్కరించే బాధ్యతను కేడబ్ల్యూడీటీ -2 (బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్)కు అప్పగించామని, ఇప్పుడు ఈ అంశం న్యాయస్థానం (ట్రిబ్యునల్) పరిశీలనలో ఉందని వివరించారు.

అలాగే ఈ ప్రాజెక్ట్ అనుమతులకు ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ అడ్డంకిగా ఉన్నాయని పేర్కొన్నారు. న్యాయ వివాదాలు, నీటి కేటాయింపుల అంశం తేలకుండా పీఆర్‌ఎల్‌ఐ ఎస్‌కు టెక్నో- ఎకనామికల్ అనుమతులు ఇవ్వలేమని..

అది తేలితేగాని ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకోలేమని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

సర్కారు నిర్లక్ష్యం పాలమూరుకు శాపం: ఎమ్మెల్సీ కవిత

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం పాలమూరు- ఎత్తిపోతలకు శాపంగా మారింద ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. 14 నెలలుగా పాలమూరు ఎత్తిపోతలను కోల్డ్ స్టోరేజీలో పెట్టిన రేవంత్ సర్కార్.. ప్రాజెక్టుకు అనుమతుల సాధనను గాలికొదిలేసిం దని ఆరోపించారు.