calender_icon.png 8 April, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి

07-04-2025 06:45:27 PM

వనపర్తి టౌన్: వరి కోతలు ప్రారంభమైన అన్ని గ్రామ పంచాయతీలు, హ్యాబిటేషన్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సోమవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. వరి కోతలు ప్రారంభమైన అన్ని హ్యాబిటేషన్లలో కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని సూచించారు.

కొనుగోలు కేంద్రంలో తేమ యంత్రాలు, తూకం యంత్రాలు, టర్పాలిన్ లు, గన్ని బ్యాగులు, ధాన్యం శుభ్రం చేసే మిషన్లు లేదా ఫ్యాన్ లు ఖచ్చితంగా ఉండాలని ఆదేశించారు. కోపరేటివ్ అధికారి, డిఆర్డీఓ, వ్యవసాయ అధికారులు, మార్కెటింగ్ అధికారి కొనుగోలు కేంద్రాలను సందర్శించి కనీస సదుపాయాలు ఉన్నాయా లేవా చూసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో దాదాపు 462 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ప్రణాళికలు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో ఆత్మకూరు, కొత్తకోట, అమరచింత, మదనపూర్ లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు కేటాయించే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మిల్లును తహసిల్దార్, సివిల్ సప్లై అధికారులు స్వయంగా సందర్శించి మిల్లు సామర్థ్యం, పని చేస్తుందా లేదా అన్ని సదుపాయాలు ఉన్నాయా, బ్యాంక్ డిపాజిట్ వంటి అన్ని చూశాక ధృవీకరణ అనంతరం మాత్రమే మిల్లుకు ధాన్యం కేటాయించాలని ఆదేశించారు.

ఎలాంటి పొరపాట్లు జరిగిన ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. యాసంగిలో వనపర్తి జిల్లాలో 148, 596 ఎకరాల్లో వరి సాగు చేయడం జరిగింది. ఇందుకు గాను 4.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేయడం జరిగింది. ఇందులో స్థానిక అవసరాలు,నేరుగా మిల్లులకు అమ్ముకోవడం వంటివి పోను దాదాపు 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలను రానున్నట్లు తెలిపారు. మొత్తం ధాన్యం కొనుగోలు చేసి సరిగ్గా ఉన్న మిల్లులకు కేటాయింపు పోను మిగిలిన ధాన్యాన్యాన్ని గోదాముల్లో నిక్షిప్తం చేసే విధంగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారి విశ్వనాథ్, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద నాయక్, పిడిడిఆర్డిఓ ఉమాదేవి, మార్కెటింగ్ అధికారి స్వరణ్ సింగ్, కోపరేటివ్ అధికారి బి రాణి తదితరులు పాల్గొన్నారు.