calender_icon.png 21 September, 2024 | 10:01 AM

15 రోజుల్లో వెయ్యికిపైగా దాడులు

15-09-2024 12:12:52 AM

  1. బంగ్లాలో దారుణంగా హిందువుల పరిస్థితి 
  2. వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తోన్న మైనారిటీలు 
  3. తాత్కాలిక ప్రభుత్వానికి 8 డిమాండ్లు

ఢాకా, సెప్టెంబర్ 14: బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులకు వ్యతిరేకంగా వేలాది మంది హిందువులు నిరసన బాట పట్టారు. బంగ్లాదేశ్ వాణిజ్య రాజధాని ఛటోగ్రామ్‌లో భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. గత 15 రోజుల్లో హిందువులపై 1,000కిపైగా దాడులు జరిగాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమపై దాడులను అరికట్టేందుకు సమర్థమైన చర్యలు తీసుకోవాలని హిందువులు వీధుల్లోకి వచ్చిన నిరసనలు తెలుపుతున్నారు. మొత్తం 8 అంశాల్లో తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనలు నిర్వహించారు.

దాడులకు పాల్పడిన వారిని ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారించి వెంటెనే శిక్షించాలని, మత సామరస్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మైనారిటీ వ్యవహారాలను పరిష్కరించేందుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ సీట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దాడుల్లో బాధితులకు పరిహారం సహా పునరావాసం కల్పించాలని స్పష్టం చేశారు. లక్షిత దాడులు, హత్యలు, ఆస్తుల విధ్వంసాన్ని ప్రస్తావిస్తూ ప్రత్యేక మైనారిటీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని పేర్కొన్నారు.