22-03-2025 02:00:34 AM
శాసనమండలిలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క
హైదరాబాద్, మార్చి 21 (విజయక్రాంతి): తమ ప్రభుత్వం వాస్తవిక బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క పేర్కొన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్లో పెట్టిన రూ.3,21,527 కోట్లను ఖర్చు చేయలేదని ఆరోపించారు. శుక్రవారం బడ్జెట్పై జరిగిన చర్చలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. గత పదేళ్లలో ఏ ఏడాది కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాస్తవిక పద్దును ప్రవేశపెట్టలేదన్నారు.
2023 డిసెంబర్ 7వ తేదీ నుంచి ఇప్పటివరకు ప్రభుత్వానికి రూ.2.80లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని, రూ.2.99లక్షల కోట్లను ఖర్చు చేసినట్లు వెల్లడించారు. పదేళ్లు పాలన చేసిన బీఆర్ఎస్ తమకు రూ.8,19,151కోట్లను అప్పులుగా అప్పగించిందన్నారు. గత సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో గ్యాప్ రావడం వల్ల సంక్షేమ పథకాలకు కేటాయించిన నిధులకు కోత పడటం వల్ల సామాన్యులు నష్టపోయారన్నారు. అంచనాలు, వాస్తవాలకు ఉన్న గ్యాప్ను 18శాతం నుంచి 0.3కి తాము తీసుకొచ్చామన్నారు.