28-02-2025 12:35:51 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): ఇంజినీరింగ్, వృత్తివిద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీట్ల కేటాయింపులో ఏపీ విద్యార్థులు పోటీపడే అవకా శాన్ని తొలగించింది. ఇంజినీరింగ్, వృత్తివిద్యలో 85 శాతం సీట్లు స్థానిక విద్యార్థులకే కేటాయించాలని నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ నిబంధన అమలు కానుంది.
ప్రత్యేక రాష్ట్ర సందర్భంగా తీసుకొచ్చిన విభజన చట్టం కాల పరిమితి ముగి యడంతో స్థానికత కోటాను సవరిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 85 శాతం సీట్లు పోగా, మిగిలిన 15 శాతం అన్ రిజర్వ్డ్ కోటాగా పరిగణించింది. ఈ 15 శాతం సీట్లకు నాలుగు రకాల వారు అర్హులుగా గుర్తిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ 15 శాతం కోటాలో తెలంగాణ స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల్లో చదివిన వారు కూడా అర్హులని తెలిపింది.
అయితే ఈ అన్రిజర్వ్డ్ కోటాలోని సీట్లకు తెలంగాణలో కనీసం పదేండ్లు చదివి ఉండాలన్న నిబంధన విధించింది. కేంద్ర, రాష్ట్ర సంస్థల్లో పనిచేస్తున్న వారి పిల్లలు, ఉద్యోగుల జీవిత భాగస్వాములు 15 శాతం సీట్లకు అర్హులని తెలిపింది. స్థానికత అంశంపై ఇప్పటికే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన రేవంత్ సర్కార్, ఆ కమిటీ నివేదిక ఆధారంగా లోకల్, నాన్లోకల్ కోటాను కేటాయించింది.
ఇప్పటివరకు ఇంజినీరింగ్, ఇతర ఉన్నత విద్యా కోర్సుల్లో 15 శాతం ఏపీ విద్యార్థులు పోటీపడేవారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఈ నిబంధన పదేండ్ల పాటు అమలైంది. కాలపరిమితి ముగియడంతో ప్రభుత్వం స్థానికతపై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.