calender_icon.png 20 September, 2024 | 2:59 PM

మన ఉనికి.. మన చేతుల్లోనే!

17-09-2024 12:00:00 AM

ఎక్కడైతే మహిళలు పూజలందుకుంటారో అక్కడే దేవతలు కొలువై ఉంటారని నమ్మే మనదేశంలో.. అనునిత్యం వారిపై లైంగిక దాడులు, దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి. పరాయి స్త్రీని మాతృమూర్తితో సమానంగా గౌరవించే సంస్కృతికి పెట్టింది పేరైన భరత భూమిపై నేడు మహిళలకు భద్రత కరవైంది. పురుషులతో పాటు స్త్రీలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు లభిస్తూ.. ఎక్కడో ఓ దగ్గర పురుష ఆధిపత్య ధోరణి గృహహింస, వరకట్న నిషేధం, కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నిషేధ చట్టాలు వచ్చినప్పటికీ.. వారిపై దాడులు ఆగట్లేదు. 

ఆ భావజాలం వల్లే..

అనాది కాలంగా మహిళను ఓ సంభోగ వస్తువుగా, పిల్లల్నికనే యంత్రంగా, వంటింటి కుందేలుగా, వరకట్నం తెచ్చేవారిగానే చూస్తున్నారు. ఈ భావజాలంతో ఆలోచించేవారి సం ఖ్య అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతంలో ఇంకా ఎక్కువ ఉంది. ముందు నుంచే ఉన్న పితృస్వామిక భావజాలం వల్ల గృహహింస అసలు నేరమే కాదని చాలామంది మహిళలు అనుకుంటున్నారు. ‘గృహిణులు అన్నాక అన్నింటీని భరించాలి. భర్తకు సేవ చేస్తూ ఉండాలి’ అని వివాహిత తల్లిదండ్రులే చెప్తుండటం చాలా బాధకరం. 

ముస్లిం సమాజంలో మహిళల చదువు పట్ల శ్రద్ధ పెట్టరు అనే అపవాదు ఉంది.. 

ఆడపిల్ల విద్యకు ముస్లిం సమాజం, హిందూ సమాజం అనే తేడా ఏం లేదు. కాకపోతే ముస్లిం కుటుంబాల్లో ఆర్థిక వెనుకబాటు తనం వల్ల ఆడ పిల్లలను చదివించరు. ఆడపిల్లను చదివిస్తే వాళ్లేమనుకుంటారో.. వీళ్లేమనుకుంటారో.. అనేవి పాత రోజులు. ప్రపంచంలో మహిళ ద్వీతియ శ్రేణి పౌరురాలిగానే పరిగణించబడుతుంది. అందులో ప్రత్యేకంగా ముస్లిం మహిళ మూడో శ్రేణిగా గుర్తింపు పొందుతున్నది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇక ముస్లిం మహిళల స్వేచ్ఛ విషయానికి వస్తే బయటి దేశాలతో, గల్ప్ దేశాలతో పోల్చితే.. మన దేశంలో చాలా ఆనందంగా జీవిస్తున్నారు. 

జర్నలిజంపై వాటి ప్రభావం..

ముస్లిం సమాజంలో మెల్లమెల్లగా చదవటం ప్రారంభించారు. విద్యావంతులు కూడా అవుతున్నారు. విద్యతోపాటు వాళ్లు ప్రగతి పథంలో ముందుకు వెళ్తున్నా కూడా మతఛాందస భావాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి జీవితం పూల పాన్పు లాంటిది కాదు. అలాగని ముళ్ల బాట అని కూడా చెప్పలేం. దారిలో ముళ్లొస్తే.. వాటిని జాగ్రత్తగా దాటుకుంటూ ముందుకు వెళ్లాలి. ఈ రోజుల్లో జర్నలిజం అంటే రాజకీయ వ్యవస్థ, పెట్టుబడి దారి వ్యవస్థ. ఈ సందర్భంలో జర్నలిస్టుగా రాణించాలంటే కొంచెం కష్టం. పాతికేళ్ల ముందు ఇలా లేదు పరిస్థితి. చదువుకున్నవాళ్లంటే చాలా గౌరవం. అందులో మహిళలు అంటే ఇంకా గౌరవంగా చూసేవాళ్లు.    

సవాళ్లతో కూడుకున్నది.. 

నిజానికి జర్నలిజంలో మహిళలు చాలా త క్కువగా ఉన్నారు. ఇందులో కూడా కుల, మత రాజకీయ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. కష్టపడి ఒక స్థాయికి వచ్చిన కూడా కొన్ని సంద ర్భాల్లో సరైన గుర్తింపుకు నోచుకోరు. ఇది బాధకరమైన విషయం. జర్నలిజం వృత్తి అంత ఈజీ ఏం కాదు. సవాళ్లతో కూడుకున్నది. ఈ వృత్తిని ఒక ఛాలెంజింగ్‌గా స్వీకరించా లి. మన తెలంగాణలో ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మహబూబ్ నగర్ కోడంగల్ చుట్టూ పక్కల గ్రా మాల్లో కనీస వసతులు లేవు. అ ప్పుడు  నేను న్యూస్ రిపోర్టు చేయడానికి వెళ్లా ను. ఆ గ్రామాలను చూసి చల్లించిపోయాను. ఇదేంటి ప్రపంచ దేశాలకు మన హైదరాబాద్ తలమానికం. కానీ హైదరాబాద్ చుట్టూ పక్కల జీవించే వారి పరిస్థితిని చూస్తే భయంకరంగా ఉంటుంది. 

మహిళా సాధికారత కోసం..

ఒక అధ్యపకురాలుగా మాత్రమే కాకుండా.. ఇప్పటి వరకు దాదాపు 15 పుస్తకాలు రచించా ను. నా రచనలు అన్నీ కూడా మహిళా సాధికారత, ఆర్థిక స్వాతంత్రం, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యంపై ఉంటాయి. నా విద్యార్థుకు చెప్పేది ఒక్కటే. ప్రతి దాన్ని చదవడం, పరిశోధించడం ద్వారా మాత్రమే నేర్చుకోగలుగుతారు. ఉన్నతంగా ఎదగాలంటే ముందు వచ్చే సవాళ్లను ఆనందంగా స్వీకరించాలి.    

‘ఏ పక్షి అయినా ఒక రెక్కతో ఎగరలేదు. మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు’ అని స్వామి వివేకానంద చెబుతారు. అది అక్షర సత్యం. ఒక సమాజం అభివృద్ధి చెందాలన్నా.. ఒక కుటుంబం బాగుపడాలన్నా.. స్త్రీ పాత్ర చాలా కీలకం అంటున్నారు ‘డాక్టర్ షేక్ హసీన’. ఒక జర్నలిస్టుగా.. అధ్యపకురాలుగా, రచయితగా.. మోటివేషనల్ స్పీకర్‌గా తనదైన శైలిలో మహిళలను, విద్యార్థులను చైతన్యపరుస్తున్నారు. ఈ సందర్భంగా తన పాతికేళ్ల ప్రయాణాన్ని  విజయక్రాంతితో పంచుకున్నారామె..   

అన్ని రంగాల్లో.. 

ఇన్ని అసమానతల మధ్య మహిళ అన్ని రంగాల్లోనూ ప్రతిభ చాటుతోంది. అయినా ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూనే ఉంది. ఎన్నో అడ్డంకుల గోడలు బద్దలు కొట్టి, మైలురాళ్లను అందుకొని, విజయాలను సొంతం చేసుకొని స్త్రీశక్తిని ప్రపంచానికి చాటుతోంది. వ్యాపార రంగంలో.. అరుంధతి భట్టాచార్య, శిఖా శర్మ, నైనా లాల్ కిద్వాయ్, రోషినీ నాడార్, సుచిత్ర ఎల్ల పాత్రలు ఎనలేనివి. ఒలింపిక్స్, కామన్‌వెల్త్ క్రీడల్లో.. పీవీ సింధూ, మనూ భాకర్, వినేశ్ ఫొగట్, సైనా, సానియా, మేరీకోమ్, నిఖత్ జరీన్ వీరందరూ చరిత్రలో తమ పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. 

1947లో మహిళా అక్షరాస్యత శాతం 6 శాతంగా ఉండగా.. ఇప్పుడు 70 శాతంకిపైగా ఎగబాకింది. ప్రస్తుతం సైన్యంలోనూ మహిళలు తమ సేవలను అందిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లోనూ ఆమె తన ఉనికిని చాటుకుంటోంది. పారిశ్రామిక, ఐటీ, సాంకేతిక, బ్యాంకింగ్ రంగాల్లో మహిళలు తమ విధుల్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. మహిళలు ఎదిగితే.. తమ చుట్టూ ఉన్నవారిని ఎదిగేలా చేస్తారు. అందుకే అత్యధిక మహిళా ప్రజాప్రతినిధులు ఉన్న ఫిన్లాండ్, నార్వే, ఐస్ లాండ్, న్యూజిలాండ్, స్వీడన్ దేశాలు ఎప్పుడో మహిళా సమానత్వాన్ని సాధించాయి. ఫలితంగా ఆ దేశాలు అభివృద్ధి దిశలో వేగంగా దూసుకెళ్తున్నాయి.