calender_icon.png 23 February, 2025 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా లెక్క.. నూరు శాతం పక్కా

23-02-2025 01:04:06 AM

బీసీలకు కులగణన నివేదికనే బైబిల్, భగవద్గీత, ఖురాన్

  1. కులగణనను అడ్డుకునేందుకు కుట్రలు l కోటా అడుగుతారనే కేంద్రం లెక్క చెప్పట్లే
  2. కేసీఆర్ చేసిన సర్వే తప్పుల తడక l మా సర్వే లెక్క ఎక్కడ తప్పిందో చెప్పాలి
  3. కేసీఆర్, బండి సంజయ్, కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్  బీసీ నేతలతో ప్రజాభవన్‌లో సమావేశం

హైదరాబాద్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): తమ ప్రభుత్వం చెప్పిన బీసీల లెక్కనే వందశాతం పక్కా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నివేదికను అనాథను చేయొద్దని పిలుపునిచ్చారు. ఇది కేవ లం నివేదిక కాదు, బీసీల భావోద్వేగమన్నా రు. బీసీల కోటా తేలితే.. వాటా అడుగుతారన్న కుట్రతోనే లెక్క తేలనివ్వట్లేదని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.

కులగణన ప్రక్రియలో తప్పులు జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపించడంపై సీఎం మండిపడ్డారు. ఏ బ్లాక్‌లో, ఎక్కడ తప్పు జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రక్రియను తప్పుబట్టడం ద్వారా మొత్తం వ్యవస్థ ను కుప్పకూల్చేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. శనివారం కులగణనపై ప్రజాభవన్ లో బీసీ నేతలతో డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీనియర్ నాయకుడు హన్మంతరావుతో కలిసి సీఎం రేవంత్ భేటీ అయ్యారు.

ఈ సం దర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కులగణన ఎక్స్ రే లాంటిదని రాహుల్ గాంధీ చెప్పారన్నా రు. బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే కులగణన చేయాల్సిందేనని చెప్పిన రాహుల్‌గాంధీ మాటలను ఆయన గుర్తు చేశారు. రాహుల్ ఇచ్చిన మాట ప్రకారమే రాష్ర్టంలో కులగణన నిర్వహించామ న్నారు.

దేశంలో ఎంతోకాలంగా ఉన్న డిమాండ్‌ను తమ సర్కారు విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. కులగణనలో ప్రభుత్వాన్ని పూర్తిస్థాయిలో భాగస్వామ్యం చేశామన్నారు. కులగణన ప్రక్రియను 50రోజుల్లో 1,03,800మంది సిబ్బందితో పూర్తి చేశామన్నారు. దీనికి రూ.160కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. 3.54 కోట్ల మంది సర్వేలో పాల్గొన్నారని, మరో 16లక్షల మంది వివరాలను నమోదు చేసుకోలేదని సీఎం చెప్పారు. 

కేసీఆర్‌వి కాకి లెక్కలు.. 

2014లో కేసీఆర్ 12 గంటల్లో సమగ్ర కుటుంబ సర్వే చేసి.. కాకి లెక్కలు చెప్పారని సీఎం పేర్కొన్నారు. ఏ రోజూ ఆయన చేసిన సర్వే నివేదికను క్యాబినెట్‌లో పెట్టలేదని, అసెంబ్లీలో కూడా చర్చించలేదన్నారు. ఎక్క డా అధికారికంగా చూపించలేదు. ఈ రాష్ట్రం లో జనాభా అంతటిని లెక్కగట్టి.. ఒక కుటుం బం, ఒక వ్యక్తి ఆ వివరాలను దాచిపెట్టుకొని, ఎన్నికలప్పుడు ఆ డేటాను ఉపయోగించుకొని రాజకీయ ప్రయోజనం పొందారని విమర్శించారు.

పదేళ్లలో ఆ సమాచారన్ని పేదల కోసం వినియోగించలేదని మండిపడ్డారు. కానీ కాంగ్రెస్ సర్కారు కులగణన చేయాలని అనుకున్నప్పుడు.. దానిపై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసేందుకు బీహార్, హర్యానా, మహరాష్ట్రకు ఒక అధికారుల బృందాన్ని పంపించామన్నారు. అలాగే, చిత్తశుద్ధితో కులగణనపై మంత్రివర్గ ఉపసం ఘాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

చట్టపరంగా ఇబ్బందులు కలగకుండా ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించి కులగణను పకడ్బందీగా నిర్వహించామన్నారు. ఇంటింటికీ ఎన్యుమరేటర్లను పంపి సమాచారాన్ని సేకరించామని వివరించారు. సేకరించిన సమా చారాన్ని తప్పులు దొర్లకుండా ఎన్యూమరేటర్ సమక్షంలో కంప్యూటరీకరించామ న్నా రు.

కేసీఆర్ చేసిన సర్వేలో చేసిన తప్పుల వల్ల ఎస్సీ, ఎస్సీ ఉపకులాలు 80కి పైగా పెరిగాయన్నారు. తాము పకడ్బందీగా నిర్వహిం చడం వల్ల వాటిని 59కులాలుగా తేల్చామన్నారు. ఇలా ఎన్నో లోపాలు ఉన్న ఆ నివే దికను బయటపెట్టలేక, ఆయనే దాన్ని దాచిపెట్టుకున్నారన్నారు. ఈ సర్వేలో బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు కోర్టులకు వెళ్లకుండా, ఎలాంటి లోపాలు లేకుండా తాము సర్వే చేశామని సీఎం పేర్కొన్నారు. 

50శాతం బీసీలు.. అర శాతం వాళ్లు.. 

బీసీల లెక్క తేలితే ఎక్కడ వాటా కోల్పోతారోనే బీఆర్‌ఎస్ కులగణనను  అడ్డుకుం టుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆ ఉద్దేశంతోనే కేసీఆర్, హరీష్‌రావు, కేటీఆర్ సర్వే లో పాల్గొనడం లేదన్నారు. ఈ సర్వే ద్వారా 50శాతానికిపైగా బీసీలు, అరశాతం వారు ఉన్నట్లు తేలుతుందని చెప్పారు. అందుకే నాటి క్యాబినెట్‌లో మెజార్టీ శాతం మందివాళ్లే ఉన్నారన్న విషయం బయటపుడుతుం దన్నారు. 

కులగణనపై బీజేపీ తప్పుడు ప్రచారం 

స్వతంత్ర దేశంలో ఎవరూ ఇప్పటివరకు కులగణన చేపట్టలేదని సీఎం స్పష్టం చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి, రాజకీయ పార్టీ చేయని సాహసాన్ని తాము చేశామన్నారు. అయితే బీజేపీలో ఉన్న ఒకటి రెండు ఆధిపత్య సామాజిక వర్గాలకు నష్టం జరుగు తుందన్న ఉద్దేశంతోనే వాళ్లు కులగణనపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

దేశం లో కులగణన చేపట్టడం ఇష్టంలేకనే బీజేపీ కులగణనపై తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. కేసీఆర్ చేసిన సర్వే ప్రకారం, బీసీలు 51 శాతం మాత్రమే అని, కానీ తాము చేసిన కులగణన ప్రకారం 56.33 శాతానికి పెరిగారని సీఎం పేర్కొన్నారు. దీని ప్రకారం బీసీల లెక్క తగ్గిందో? పెరిగిందో చెప్పాలని అడిగా రు.

అంతేకాకుండా ఓసీల లెక్క కేసీఆర్ చేసినప్పుడు 21శాతం ఓసీలు ఉంటే, ఇప్పుడు 15.79శాతం ఉన్నారన్నారు. ఇప్పుడు ఓసీల లెక్క తగ్గిందా? పెరిగిందా? అని ప్రశ్నించా రు. కేసీఆర్ చేసిన సర్వేలో నాలుగు కేటగిరీలు ఉంటే, తాము చేసిన క్యాటగిరీలో ఐదు కేటగిరీలు ఉన్నాయన్నారు. 

అలా మాట్లాడొచ్చా?

కలగణనపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కొం దరు నాయకులు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వారికి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సర్వేపై మనోళ్లే తెలిసీతెలియక మాట్లాడుతున్నారన్నారు. స్వాతంత్య్రం వచ్చి న తర్వాత ఏ నాయకుడు కూడా కులగణన చేసే ప్రయత్నం చేయలేదన్నారు. కులగణన ను చేసేందుకు ప్రయత్నిస్తుంటే తనపై రాళ్లు రువ్వే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

బీసీలను లెక్కచేయని కేసీఆర్, కేటీఆర్ మంచొళ్లా అన్నారు. బీసీ సంఘాలు మీటింగ్ పెడింతే కాంగ్రెస్ నాయకులే వెళ్లి కూర్చోవడంపై ఆయన అసహనానికి గురయ్యారు. 1931లో బ్రిటీషర్స్ చేసిన సర్వే ఇప్పటికీ ఆధారమన్నా రు. మండల్ కమిషన్ ఆధారంగా అమలైన రిజర్వేషన్లు కూడా బ్రిటిషర్స్ నివేదిక ప్రకారమే జరిగాయని సీఎం గుర్తు చేశారు.

అయి తే 2011లో యూపీఏ2 ప్రభుత్వం సోనియా గాంధీ ఆదేశాల మేరకు మన్మోహన్ సింగ్ కులగణన చేశారన్నారు. కాని కొన్ని కారణా ల వల్ల ఆ నివేదిక బయటపెట్టలేదన్నారు. ప్ర ధాని మోదీకి చిత్తశుద్ధి ఉంటే, ఆ నివేదికను ఇప్పుడు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

చరిత్రలో నిలిచిపోయే సందర్భం

భవిష్యత్‌లో దేశంలో బీసీ రిజర్వేషన్ల గురి ంచి చర్చించాలన్నా.. సర్వే చేయాలన్నా తెలంగాణ గురించి, రేవంత్ రెడ్డి గురించి చర్చించుకునేలా ఈ సర్వేను చేసినట్లు సీఎం చెప్పారు. భవిష్యత్‌లో ఎవరు సర్వే చేసిన.. రేవంత్ రెడ్డి బీసీల లెక్క పక్కా చెప్పిండు అంటారని చెప్పుకొచ్చారు. ఇది చరిత్రలో నిలిచిపోయే సందర్భమని గుర్తు చేశారు. ఈ అవకాశాన్ని జారవిడిచుకుంటే చరిత్ర క్షమించదన్నారు. దీన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

ముస్లింలను ఓబీసీల్లో చేర్చింది మోదీయే.. 

కులగణన సర్వేలో ముస్లింలను బీసీ జాబితాలో చేర్చడంపై బీజేపీ కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండిసంజయ్ చేసిన విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. గుజరాత్‌లో మోదీ సీఎంగా.. 70 ముస్లిం కులాలను ఓబీసీ కేటగిరీలో చేర్చినట్లు, ప్రస్తుతం వారు ఆ ప్రయోజనం పొందుతున్నారని, దీన్ని మీడియాలో ఎప్పుడూ ప్రచారం చేసుకోలేదని స్వయంగా ఆయనే 2022లో ఓ ఇంటర్వ్యూలో చెప్పారని సీఎం గుర్తు చేశారు. దీనికి బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పుడు మాటలు మాట్లాడటం కాదని, ఏ బ్లాక్ లో ఏ ఇంట్లో తప్పు జరిగిందో నిరూపించాలని కేసీఆర్, బండి సంజయ్, కిషన్ రెడ్డికి సీఎం సవాల్ విసిరారు. 

సామాజికవర్గాలవారీగా తీర్మానాలు 

పకడ్బందీ ప్రక్రియతో కులగణన చేశామని, కానీ ప్రతిపక్షాలు దీనిపై విమర్శలు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. కులగణన కోసం ఒక సీఎంగా తాను శక్తికి మించి చేశానని, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత బీసీ నాయకులపైనే ఉందన్నారు. ఈ కులగణనను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని మోడిని కూడా కులగణన చేసే పరిస్థితికి తీసుకురావాలన్నారు. కులగణన ప్రక్రియ పూర్తి చేయడంతో తన బాధ్యత పూర్తయినట్లు చెప్పారు.

దీన్ని పట్టాలెక్కించి గమ్యం చేర్చే వరకు ముందుకు తీసుకెళ్లే బాధ్యత బీసీ నాయకులదే అన్నారు. జనగణనలో కులగణన చేర్చాలని ఈ సమావేశం వేదికగా తీర్మానం చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. సామాజికవర్గాలవారీగా సమావేశాలు నిర్వహించి మార్చి 10లోగా తీర్మానాలు చేయాలని పిలుపునిచ్చారు. ఐకమత్యాన్ని చాటితేనే రాజకీయంగా, విద్య ఉద్యోగాల పరంగా ప్రయోజనం ఉంటుందన్నారు. 

ప్రభుత్వం చిత్త శుద్ధితో సర్వే చేసింది: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభు త్వం చిత్తశుద్ధితో సర్వేను చేసినా ప్రతిపక్షాలు విమర్శులు చేస్తున్నాయని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకున్నదన్నారు. సర్వే నిర్వహణ కోసం అన్ని సౌకర్యాలను కల్పించిందన్నారు.

గతంలో చాలా రాష్ట్రాల్లో సర్వేలు మొదలు పెట్టినా అవి ముందుకు సాగలేదన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో నిర్వహిస్తోందన్నారు. సర్వే విష యంలో సీఎంకు ఒత్తిళ్లు వచ్చినా ఆయన సర్వేను పూర్తి చేశారన్నారు. కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమా ర్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఈరావత్రి అనిల్, ఇతర బీసీ నాయకులు పాల్గొన్నారు.

సర్వేతో 8 కోట్ల పేజీల సమాచారం సేకరించాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

కాంగ్రెస్ పార్టీ ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని, 8 కోట్ల పేజీలకు పైబడిన సమాచారం సర్వే ద్వారా సేకరించామని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు. దేశంలో ఇప్పటివరకు బీసీ జనగణన సైంటిఫిక్ గా జరగలేదని, మొదటిసారి తేల్చింది తెలంగాణ ప్రభుత్వమే అని స్పష్టం చేసారు. రాష్ర్ట ప్రభుత్వం చేసిన బీసీ కులగణనను సర్వే తోనూ పోల్చలేరన్నారు.

2011లో జరిగిన జనగణనలో కేవలం ఎస్సీ, ఎస్టీ, ఇతర జనాభా లెక్కలే తేల్చారని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే అధికారికం కాదన్నారు. దేశంలో మొదటిసారి బీసీ జనాభాను అధికారికంగా లెక్క తేల్చి ముద్ర వేశామన్నారు. దీనిని ఆయా వర్గాల ప్రయోజనం కోసం ఎలా ముందుకు తీసుకువెళ్లాలనేది బీసీ ప్రజా ప్రతినిధులు, సంఘాలు ఆలోచన చేయాలన్నారు. బీసీ సర్వే అధికారికంగా జరగడం మూలంగా బీఆర్‌ఎస్‌కు నష్టం జరిగిందన్నారు.

తెలంగాణలో బీసీ సర్వే విజయవంతం అయితే దేశవ్యాప్తంగా చేయాల్సి వస్తుంది. బీజేపీపై ఒత్తిడి పెరుగుతుందని ఆ పార్టీ నేతలు సర్వేపై దుష్ర్పచారం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి ఉన్నప్పటికీ, రాహుల్ గాంధీ సూచన మేరకు సర్వేను చేశారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

తనకు వచ్చిన ఉద్యోగాన్ని సామాజిక న్యాయం చేయడానికి ఉపయోగిస్తా అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఎక్కడ రాజీ పడవద్దని ప్రణాళిక శాఖ చూస్తున్న తనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారన్నారు. సర్వేపై ఎవరు ఏ ప్రశ్న అడిగినా అధికారికంగా సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 

కులగణన బీజేపీ, బీఆర్‌ఎస్ ఇష్టం లేదు: కాంగ్రెస్ మాజీ ఎంపీ వి. హన్మంతరావు

కులగణన అనేది బీజేపీ, బీఆర్‌ఎస్‌కు ఇష్టం లేదని కాంగ్రెస్ మాజీ ఎంపీ వి. హన్మంతరావు విమర్శించారు. దేశవ్యాప్తంగా చేయాల్సి వస్తుందని బీజేపీ వ్యతిరేకిస్తోందన్నారు. బీసీ సబ్‌ప్లాన్ అమలు చేయాలని, బడ్జెట్‌లో నిధులు కేటాయించాలన్నారు.

బీసీల్లో కింది కులాలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. రాహుల్ గాంధీ ఆలోచనలను రేవంత్ రెడ్డి అమలు చేయడం అభినందనీయమన్నారు. సీఎం స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకొచ్చి క్రీడలను  ప్రోత్సహిస్తున్నారన్నారు.