03-03-2025 08:09:55 PM
ఫైర్, ట్రాఫిక్ ఎన్ఓసి పత్రాలు సమర్పించని ఫలితం
విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టిన స్కూల్ యాజమాన్యం
రాజేంద్రనగర్ (కార్వాన్) (విజయక్రాంతి): విద్యాశాఖ నిబంధనలు, ప్రమాణాలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న లంగర్ హౌస్ లోని ఆర్చీడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను విద్యాశాఖ అధికారులు సోమవారం సీజ్ చేశారు. ఆర్చిడ్స్ స్కూల్ యాజమాన్యం సరైన పత్రాలు లేకుండా ఇన్ని రోజులు నడిపించినట్లు విద్యాశాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యం ట్రాఫిక్ అదేవిధంగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా ఆర్జేడి అధికారులకు పత్రాలు సమర్పించకపోవడంతో ఈ మేరకు డీఈఓ ఆదేశాల మేరకు సోమవారం ఒక అధికారులు ఆచిడ్స్ స్కూల్ ను సీజ్ చేశారు.
అదేవిధంగా పాఠశాలలోని అన్ని రికార్డ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు గోల్కొండ ఎంఈఓ రమణ రాజు తెలియజేశారు. పత్రాల సమర్పణకు స్కూల్ యాజమాన్యానికి సమయం ఇచ్చినా కూడా సద్వినియోగం చేసుకోలేదని ఆయన పేర్కొన్నారు. ప్రశాలలో సుమారు 800 మంది విద్యార్థులు ఉన్నారని వారిని ఇతర పాఠశాలలకు పంపించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎంఈఓ వివరించారు. ఆర్జెడి డీఈఓ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అన్ని స్కూళ్ల యాజమాన్యాలు విద్యాశాఖ సూచించిన నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.