ఎల్బీనగర్, సెప్టెంబర్ 17: చైతన్యపురి, ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో సోమవారం రాత్రి పోలీసులు భారీస్థాయిలో నిషేధిత ఓపియం, హష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. చైతన్యపురి, ఎల్బీనగర్ పోలీసులతోపాటు మహేశ్వరం ఎస్వోటీ బృందాలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో వేర్వేరు ప్రాంతాల్లో నిషేధిత మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. రాజస్తాన్లోని బీవార్ జిల్లాకు చెందిన గుగన్ నరేంద్ర(25) చైతన్యపురిలోని హనుమాన్నగర్ కాలనీలో బాలాజీ కిరాణా స్టోర్తో దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈజీమనీకి అలవాటుపడి డ్రగ్స్ విక్రయిస్తున్నాడు.
ఈ క్రమంలో నరేంద్ర చైతన్యపురిలోని జీనియస్ గ్రామర్ స్కూల్ వద్ద ఓవ్యక్తికి డ్రగ్స్ విక్రయిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ.3.50లక్షల విలువ చేసే ఓపీయం(199గ్రాములు), రూ.11వేల నగదు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఎల్బీనగర్లోని ఎన్టీఆర్నగర్ కూరగాయల మార్కె ట్ వద్ద ఒడిశాకు చెందిన ఘాసిరామ్ పాంగి(26) పండ్ల వ్యాపారి ఈనెల 15న హష్ ఆయిల్ విక్రయిస్తుండగా ఎల్బీనగర్, మహేశ్వరం ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. ఇతడి నుంచి రూ.4.30 లక్షల విలువ చేసే 632గ్రాముల హషీష్ అయిల్ను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సీపీ సుధీర్ బాబు నేతృత్వంలో సిబ్బంది నిందితులను అరెస్టు చేశారు.