16-03-2025 11:20:22 PM
అమెరికన్ ఏఐ రీసెర్చర్, ప్రముఖ పాడ్ కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మాన్ నిర్వహించిన పాడ్కాస్ట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ పాకిస్తాన్పై తీవ్ర విమర్శలు చేశారు. భారతదేశం శాంతిని స్థాపించడానికి ప్రయత్నిస్తుండగా, దానికి బదులుగా పాకిస్తాన్ నుండి శత్రుత్వం, ద్రోహం ఎదురైందని ఆయన అన్నారు. 2014లో తన ప్రమాణ స్వీకారానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ను ఆహ్వానించానని, తద్వారా రెండు దేశాల మధ్య సంబంధాలలో కొత్త ప్రారంభం ఉంటుందని ఆశించానని మోడీ గుర్తుకు చేసుకున్నారు. జ్ఞానం కలిగి వారు శాంతి మార్గాన్ని ఎంచుకుంటారని తాను ఆశిస్తున్నానని ఆయన అన్నారు.
పాకిస్తాన్ ప్రజలు కూడా శాంతిని కోరుకుంటున్నారని, వారు నిరంతర పోరాటం, అశాంతి, భయంకరమైన ఉగ్రవాదంతో విసిగిపోయారని మోడీ పేర్కొన్నారు. తన మొదటి పదవీకాలంలో పాకిస్తాన్తో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి తాను చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని ఆయన అన్నారు. తన విదేశాంగ విధానాన్ని ప్రశ్నించిన వారే, తాను సార్క్ దేశాధినేతలందరినీ ఆహ్వానించానని తెలుసుకుని ఆశ్చర్యపోయారని, అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన జ్ఞాపకాలలో ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని చక్కగా వివరించారని ప్రధాని మోడీ తెలిపారు. ఇది భారతదేశ విదేశాంగ విధానం ఎంత స్పష్టంగా, నమ్మకంగా ఉందో చెప్పడానికి నిదర్శనమని, భారతదేశం శాంతికి, సామరస్యానికి కట్టుబడి ఉందని ప్రపంచానికి స్పష్టమైన సందేశాన్ని పంపామని, కానీ.. ఆశించిన ఫలితం రాలేదని ఆయన అన్నారు. అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వాన్ని మోడీ ప్రశంసించారు.
గత సంవత్సరం డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన హత్యాయత్నాలను ప్రస్తావిస్తూ, ట్రంప్ ధైర్యం, నిబద్ధతను మోడీ ప్రశంసించారు. డొనాల్డ్ ట్రంప్ తో తనకు బలమైన బంధం ఉందని ఆయన పేర్కొన్నారు. 2002లో జరిగినా గుజరాత్ అల్లర్ల గురించి మాట్లాడుతూ... గోద్రా సంఘటన గురించి తప్పుడు కథనాలు వ్యాపించాయని మోడీ తెలిపారు. 2002కి ముందు గుజరాత్ లో దాదాపు 250కి పైగా అల్లర్లు జరిగాయని, మత హింస తరచుగా జరిగేదని ప్రధాని మోడీ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ప్రపంచంలో ఉగ్రవాద కార్యకలాపాలు, హింస చాలా వరకు పెరిగిందని మోడీ అన్నారు. 2002 నుండి గుజరాత్ రాష్ట్రంలో ఒక్క అల్లర్లు కూడా జరగలేదని ప్రధాని మోడీ నొక్కి చెప్పారు. తన ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడదని, "సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్" అనే సూత్రాన్ని అనుసరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అల్లర్ల తర్వాత ప్రజలు తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని, కానీ చివరికి న్యాయం గెలిచిందని, కోర్టులు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చాయని ఆయన అన్నారు.