10-03-2025 11:22:33 PM
‘ఎఫ్ఓఎంఎస్’ అమలుకు టీజీఎస్పీడీసీఎల్ చర్యలు..
సీఎండీ ముషారఫ్ ఫారుఖీ..
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): విద్యుత్ సరఫరాలో లోపాలను త్వరగా గుర్తించి సకాలంలో పరిష్కరించేందుకు టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని 11కేవీ ఫీడర్లలో ఫీడర్ ఔటేజ్ మేనేజ్మెంట్ సిస్టం(ఎఫ్ఓఎంఎస్) సాంకేతికను అమలు చేస్తున్నామని ఆ సంస్థ ఛైర్మన్, ఎండీ ముషారఫ్ ఫారుఖీ తెలిపారు. ఫీడర్లో సాంకేతిక సమస్య తలెత్తిన ప్రాంతాన్ని ఆటోమేటిక్గా గుర్తించడం జరుగుతుందన్నారు. సమస్యను సులభంగా గుర్తించేందుకు వీలుగా జీఐఎస్ డాటాను సంబంధిత ఏఈకి ఎస్ఏఎస్ఏ యాప్కు బజర్సౌండ్ ద్వారా అప్రమత్తం చేస్తుందని చెప్పారు.
దీంతో విద్యుత్ మరమ్మతు బృందాలు సకాలంలో చేరుకుని విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపడుతారన్నారు. కాగా ఎంత వ్యవధిలో సమస్యను పరిష్కరించారనే సమాచారాన్ని సీఎండీ స్థాయి వరకు రియల్ టైంలో పర్యవేక్షించవ్చని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో 11కెవీ ఫీడర్లుండగా 8621, ప్రస్తుతం 4433 ఫీడర్లకు ఈ సాంకేతికతను పొందుపర్చామన్నారు. ఈ నెల చివరి నాటికి 2వేల ఫీడర్లకు, మిగతా ఫీడర్లకు ఏప్రిల్ చివరి వారానికల్లా అమర్చనున్నట్లు పేర్కొన్నారు.
యాసంగి సీజన్ పీక్ స్థాయిలో ఉంది.. అప్రమత్తంగా ఉండాలి
యాసంగి సీజన్ పీక్ స్థాయిలో ఉన్నదని విద్యుత్ వినియోగం 17వేల మెగా వాట్లకు చేరువలో ఉందన్నారు. టీజీఎస్పీడీసీఎల్ సంస్థ పరిధిలోని అన్ని సర్కిళ్లు, జోన్ల ఎస్ఈలు, సీఈలతో సీఎండీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డిస్కం పరిధిలో పీక్ డిమాండ్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతున్నందున మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులకు సూచించారు. కాగా ఈ సీజన్లో 10వేల మెగావాట్లకు మించి గరిష్ఠ డిమాండ్ రికార్డవుతోంది.
ఈ నెల 4న 10533మెగా వాట్ల రికార్డు స్థాయి పీక్ డిమాండ్, 5న 215.52 మిలియన్ యూనిట్ల రికార్డు స్థాయి విద్యుత్ వినియోగం నమోదైంది. కాగా గతేడాది సెప్టెంబర్ 20న 9910మెగా వాట్లు అత్యధిక డిమాండ్, సెప్టెంబర్ 19న 198.80మిలియన్ యూనిట్ల రికార్డు స్థాయి వినియోగం నమోదైంది. గతంలో సెప్టెంబర్ నెలలో మాత్రమే నమోదయ్యే రికార్డు స్థాయి డిమాండ్ వినియోగం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే నమోదు కావడం గమనార్హం.