calender_icon.png 25 September, 2024 | 8:00 PM

ఉల్లి ధరల కట్టడికి చర్యలు

24-09-2024 12:00:00 AM

టోకు మార్కెట్లోకి బఫర్ స్టాక్ విడుదలకు కేంద్రం నిర్ణయం

ఢిల్లీ: దేశంలో ఉల్లి ధరలను  నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇది వరకే సేకరించి ముందస్తుగా నిల్వ చేసిన బఫర్ స్టాక్‌ను హోల్ సేల్ మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయించింది. ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు తొలగించిన నేపథ్యంలో దేశీయంగా ఉల్లి రిటైల్ ధరలు పెరుగుతుండడంతో కేంద్రం చర్యలు చేపట్టింది. ఢిల్లీతో పాటు మరికొన్ని ప్రధాన నగరాల్లోని హోల్‌సేల్ మార్కెట్లోకి బఫర్ స్టాకు విడుదల చేయాలని నిర్ణయించినట్లు వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి నిధి ఖరే సోమవారం పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా రాయితీ ఉల్లిని రిటైల్‌గా విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు.‘ఇటీవల ఎగుమతుల సుంకం ఎత్తివేసిన నేపథ్యంలో ఉల్లి ధరలు పెరుగుతా యని అంచనా వేస్తున్నాం. దీంతో 4.7 లక్షల టన్నుల బఫర్ స్టాక్ విడుదలకు నిర్ణయించాం. దీంతో పాటు ఖరీఫ్లో పెరిగిన ఉల్లి విస్తీర్ణంతో ఉల్లి ధరలకు కళ్లెం పడుతుందని ఆశిస్తున్నాం‘ అని పేర్కొన్నారు. ఉల్లి ఎగుమతులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ కేంద్రం పది రోజుల క్రితం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. టన్నుకు 550 డాలర్లుగా ఉన్న కనీస ఎగుమతి ధరను తొలగించింది.

దేశీయంగా ఉల్లి రైతులకు మెరుగైన ధర దక్కాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ముడి పామాయిల్, రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై సుంకాన్ని పెంచింది. ఈ క్రమంలోనే దేశీయంగా ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో రూ.55 పలుకుతోంది. ముంబయిలో రూ.58, చెన్నైలో రూ.60 చొప్పున విక్రయిస్తున్నారు. ఇతర ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో ఉల్లిపై ఆంక్షల ఎత్తివేసినప్పటి నుంచి ఎన్సీసీఎఫ్.

నాఫెడ్ ద్వారా దిల్లీ సహా ఇతర రాష్ట్ర రాజధానుల్లో రూ.35కే కిలో చొప్పున మొబైల్ వ్యాన్ల ద్వారా కేజీ ఉల్లిని కేంద్రం విక్రయిస్తోంది. జాతీయ సగటు కంటే ఉల్లి ధర ఎక్కువగా ఉన్న నగరాల్లో రాయితీ ఉల్లి విక్రయాలు చేపట్టనున్నట్లు ఖరే చెప్పారు. దేశీయంగా రైతులకు రక్షణ కల్పించే ’ఉద్దేశంతోనే వంట నూనెలపై దిగుమతుల సుంకం పెంచినట్లు తెలిపారు. టమాటా ధరలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని, అవసరమైతే జోక్యం చేసుకుంటామని పేర్కొన్నారు.