11-04-2025 07:36:46 PM
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): జ్యోతిరావు పూలే జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని అంబేద్కర్ సంఘం నాయకులు పద్మారావు నరేష్ లు అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని 6వ వార్డు ఇంద్రానగర్ కాలనీలో మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతినీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మహాత్మ జ్యోతిరావు పూలే మహారాష్ట్రలోని పూణే పట్టణంలో మాలి (ముదిరాజ్) కులంలో జన్మించాడని తెలిపారు. శూద్రుడైనందున ఆనాటి సమాజంలో మహాత్మ జ్యోతిరావు పూలే ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడని అన్నారు.
కుల నిర్మూలన కోసం సమాజంలో అసమానతలు తొలగించడం కోసం అహర్నిశలు కృషి చేశాడని పేర్కొన్నారు. మూఢనమ్మకాలు, అంటరానితనం, వివక్షత మానవుల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని నేటితరం వాటికి దూరంగా ఉంటూ మహాత్మ జ్యోతిరావు పూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. జ్యోతిరావు పూలే సమాజంలోని అన్ని వర్గాల వారు కలిసి ఉండాలని జ్ఞాన బోధన చేశాడన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు పద్మారావు, నరేష్, పోచయ్య, శివానందం, రాజు, మానేయ్య, బాలు తదితరులు పాల్గొన్నారు.