09-03-2025 11:07:50 PM
టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం బోడు గ్రామానికి వెళ్లే రహదారిలోని పెద్దమ్మ తల్లి గుడి సమీపంలోని మూలమలుపు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ప్రమాద సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి గ్రామానికి చెందిన జోగ వంశీ, పొడుగు ప్రవీణ్ అనే యువకులు పల్సర్ ద్విచక్ర వాహనంపై వేగంగా వెళుతూ పెద్దమ్మ గుడి, తుమ్మలచెలక గ్రామాల మధ్యలోని మూలమూలుపు వద్ద చెట్టును ఢీ కొట్టారు.
ఈ ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలు అవ్వగా, మార్గంలో వెళ్లే ప్రయాణికులు గుర్తించి ఆటోలో మొదట మండలంలోని సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ఉసిరికాయలపల్లికి చెందిన జోగ వంశీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాయాల పాలైన కొడుకు ప్రవీణ్ పరిస్థితి విషమంగా ఉంది. టేకులపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.