29-03-2025 01:37:46 AM
హైదరాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): -పైలట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, బేస్మెంట్ పూర్తయిన ఇండ్లకు తక్షణం చెల్లింపులు జరపాలని రాష్ర్ట రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.
శుక్రవారం సచివాలయంలో వరంగల్ స్మార్ట్ సిటీ పనులు, వరం గల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, తాగునీరు, ఇందిరమ్మఇండ్లు తదితర అంశాలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క), అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డితో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లా సమీ క్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లనిర్మాణం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశమని, దీనిని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్లు పనిచేయాలని సూచించారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధ్దిదారులకు ప్రభుత్వం నాలుగు విడతల్లో చెల్లింపులు చేస్తుందని, మొదటి విడతలో బేస్మెంట్ లెవెల్ పూర్తయిన ఇండ్లకు లక్ష రూపాయలు ఇస్తుంద న్నారు. బేస్మెంట్ పూర్తయిన ఇండ్లవివరాలను హౌసింగ్ విభాగానికి పంపిస్తే తక్షణమే చెల్లింపులు చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో ఇండ్ల స్థలాలు లేని అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇప్పటివరకు కేటాయించ ని 2 బీహెచ్కే ఇండ్లను కేటాయించాలన్నా రు. అలాగే మొండి గోడలతో ఉన్న ఇండ్లను పూర్తిచేయడానికి కాంట్రాక్టర్ ముందుకురాని పక్షంలో లబ్ధ్దిదారులే ఆ ఇండ్లను పూర్తి చేసుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు.
తాగునీటి సమస్య రావొద్దు..
వేసవి కాలంలో ఏ గ్రామం, పట్టణంలోగానీ తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని, వచ్చే మూడు నెలలు చాలా కీలకమని మంత్రి పొంగులేటి అధికారులకు సూచించారు. నీటికొరత ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయ డం, చెడిపోయిన బోర్లు, హ్యాండ్పంప్లను తక్షణం మరమ్మతులు చేపట్టాలని సూచించారు.
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవననిర్మాణ పనులను రెండునెలల్లో పూర్తిచేసి ఆ తర్వాత మరో నెలరోజుల్లో వైద్యసేవలకు అవసరమైన పరికరాలను అమర్చి జూన్ చివరి నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.
శాశ్వత డంపింగ్ యార్డ్కు భూసేకరణ..
మడికొండ డంపింగ్ యార్డు సమస్యకు వారం రోజుల్లో తాత్కాలిక పరిష్కారం చూపించి ఆ తర్వాత శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూ చించారు. వరంగల్, కరీంనగర్ రహదారి ప్రాంతంలో శాశ్వత డంపింగ్ యార్డు కోసం 150 నుంచి 200 ఎకరాల భూమిని సేకరించాలని కలెక్టర్లను ఆదేశించారు.
వరంగల్ భద్రకాళి చెరువు పూడికతీత పనులుచేపట్టాలన్నారు. వరంగల్ స్మార్ట్ సిటీ పనుల విషయంలో అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించా రు. సమావేశంలో శాసనసభ్యులు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డి, యశస్వినిరెడ్డి, దొంతి మాధవరెడ్డి, కేఆర్ నాగరాజు, మురళీనాయక్, రామచంద్రనాయక్, రేవూరి ప్రకాశ్రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, ఆర్అండ్బీ సెక్రటరీ హరిచందన పాల్గొన్నారు.