25-03-2025 11:48:24 PM
ఆమోదం తెలిపిన లోక్సభ..
న్యూఢిల్లీ: ఒకే దేశం ఒకే ఎన్నిక కోసం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ పదవీకాలన్ని పొడిగించేందుకు లోక్సభ మంగళవారం ఆమోదం తెలిపింది. ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ చైర్మన్ పీపీ చౌదరీ లోక్సభలో కమిటీ పదవీకాలాన్ని పొడిగించే తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టగా.. వాయిస్ ఓటు ద్వారా ఆమోదించారు. రాజ్యసభ నుంచి కొత్త సభ్యుడికి కూడా పార్లమెంటరీ కమిటీలో స్థానం కల్పించినట్టు లోక్సభ సెక్రటరీ జనరల్ సభకు తెలిపారు.
ఇటీవలే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పదవికి రాజీనామా చేయడంతో 39 మంది సభ్యుల కమిటీలో ఒక పోస్టు ఖాళీ కావడంతో కొత్త సభ్యుడికి చోటు కల్పించారు. దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు తీసుకువచ్చిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బిల్లును అధ్యయనం చేసేందుకు 39 మంది ఎంపీలతో జేపీసీ కమిటీ ఏర్పాటయింది. కమిటీలో లోక్సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది ఉండగా.. బీజేపీ ఎంపీ పీపీ చౌదరీ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు.