calender_icon.png 8 October, 2024 | 8:27 AM

హిమాచల్ ఆర్టీసీకి 327 ఒలెక్ట్రా బస్సులు

08-10-2024 01:20:33 AM

13 వేల అడుగుల ఎత్తులోనూ ప్రయాణం

హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): హిమాచల్‌ప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సుల టెండర్లను దక్కించుకున్న హైదరాబాద్‌కు చెందిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ కంపెనీ.. తమ కంపెనీకి చెందిన 327 ఈవీ బస్సులను ఆ రాష్ట్రానికి అందించనుంది. ఈ సంస్థకు చెందిన 25 బస్సులు ఇప్పటికే హిమాచల్ ఆర్టీసీలో నడుస్తున్నాయి.

కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు దశలవారీగా అన్ని చోట్ల డీజిల్ బస్సులను తగ్గించి ఈవీ బస్సులను పెంచుతున్న క్రమంలో హిమాచల్‌ప్రదేశ్ సైతం అదేబాటలో పయణిస్తోంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలోని మనాలి  రోహ్‌తంగ్ మధ్య 13 వేల అడుగుల ఎత్తులోనూ ఒలెక్ట్రా ఈవీ బస్సులు విజయవంతంగా నడుస్తున్నాయని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రపంచంలో అత్యంత ఎత్తులో నడిచే విద్యుత్ బస్సులను రూపొందించి రికార్డు సృష్టించినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అత్యంత ఆధునికమైన ఈ బస్సుల్లో అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్, ఎయిర్ సస్పెన్షన్, ఎలక్ట్రిక్ స్టెబిలిటీ కంట్రోల్, సీసీ కెమెరా వంటి సౌకర్యాలుంటాయి. ఇందులో ఒకసారి చార్జి చేస్తే 250 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.