ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): బతుకమ్మ చీరలు ఇచ్చామని హరీశ్రావు గొప్పలు చెప్పుకుంటున్నారని, వారు ఇచ్చిన చీరలు ఎలా ఉన్నాయో ఆక్కాచెల్లెమ్మలకు తెలుసని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన చీరలు పాత సామాన్లకు, పంట చేలకు అడ్డంగా కట్టడానికి తప్ప కట్టుకోవడానికి ఉపయోగపడలేదని విమర్శించారు.
గురువారం గాంధీభవన్లో ఆయన మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని, ఇళ్లకు రెండు వందల యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందచేస్తున్నామని వివరించారు.
ఇప్పటికైనా తమ ప్రభుత్వాన్ని విమర్శించడం మానకపోతే తెలంగాణ అక్కాచెల్లెమ్మల చేతిలో మరోసారి చిత్తు కావడం ఖాయమని హరీశ్రావును హెచ్చరించారు. పదేండ్లలో మహిళలను అన్ని రకాలుగా అణచివేసింది కేసీఆరేనని, కనీసం మంత్రి వర్గంలో మహిళలకు అవకాశం ఇవ్వలేదన్నారు. స్వయం సహాయక సంఘాలను నిర్వీర్యం చేశారని తెలిపారు.