19-03-2025 01:53:40 AM
జగిత్యాల, మార్చి 18 (విజయక్రాంతి): జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించి సాగు విస్తీర్ణం పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ సూచించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఆయిల్ పామ్ మొక్కల గ్రౌండింగ్ గురించి సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సకాలంలో ఆయిల్ పామ్ సాగు వివరాలపై రివ్యూ తీసుకున్నారు.
రానున్న 25-26 సంవత్సరంలో మన జిల్లాలో 3500, ఎకరాలలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ సాగుకోసం చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగు పురోగతిపై వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారులు రెగ్యులర్ మానిటరింగ్ చేయాలని అన్నారు. ఆయిల్ పామ్ సాగుకు ఆసక్తి కనబర్చే రైతుల నుంచి త్వరితగతిన మొక్కలకు, డ్రిప్ కోసం డీడీలు కట్టించాలన్నారు.
ఆయిల్ పామ్ మొక్కలు నాటిన రైతుకు సబ్సిడీ అందేలా చూడాలని, డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ సాగు నీరు అందని రైతులకు గుర్తించి రైతులను ఆయిల్ పామ్ సాగుకు డైవర్ట్ అయ్యేలా చూడాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో డిహెచ్ఎస్ఓ శ్యామ్’ప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, లోహియా కంపెనీ సాంకేతిక సలహాదారులు డాక్టర్ రంగనాయకులు, టెక్నికల్ అడ్వైజర్లు, ఉద్యాన శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.