calender_icon.png 30 April, 2025 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వామ్మో వడదెబ్బ.. అప్రమత్తతే అండ!

30-04-2025 12:00:00 AM

  1. ఈ ఏడాది మండుతున్న ఎండలు
  2. ప్రభుత్వం ముందస్తు చర్యలు
  3. అందుబాటులో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు
  4. ఎక్స్‌గ్రేషియా రూ.4 లక్షలకు పెంపు

సంగారెడ్డి, ఏప్రిల్ 29(విజయక్రాంతి): ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వడగాలులు, వడదెబ్బను ప్రత్యే క విపత్తుగా పరిగణించింది. వాటి కారణం గా మృతి చెందే వారి కుటుంబాలకు అందించే ఎక్స్రేషియాను భారీగా పెంచింది.

అయితే ప్రజలు వాటి భారిన పడకుండా ఉండేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎండల తీవ్రత పెరుగుతున్న క్రమంలో చల్లని తాగునీరు అందు బాటులో ఉంచేలా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా చలివేంద్రాలను ఏర్పాటు చేశారు.

ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ఏఎన్‌ఎంలు, ఆరోగ్య, ఆశ కార్యకర్తల వద్ద ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. ప్రజలు కూడా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాల ని వైద్యాధికారులు సూచిస్తున్నారు. 

యంత్రాంగం సంసిద్ధం.. 

ప్రభుత్వం వడదెబ్బను విపత్తుగా ప్రకటించడంతో దాన్ని అధిగమించేందుకు యం త్రాంగం సిద్ధమైంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు జిల్లాలోని తహసీ ల్దా ర్లు, ఎంపీడీవోలు, మెడికల్ ఆఫీసర్లతో ఇటీవల సమీక్ష నిర్వహించారు. దీంతో జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండల కేంద్రాల్లోని ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. వడదెబ్బతో వచ్చే బాధితులకు తక్షణ వైద్య సాయమందించేలా ప్రత్యేక పడకలతో జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఏర్పాట్లు చేశారు.   

వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్లకు, పారామెడికల్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఎండల తీవ్రతతో కలిగే అనర్థాలు, వడదెబ్బతో పాటు సత్వర వైద్యసేవలు అందించేలా సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. పీహెచ్సీలతో పాటు ఆరోగ్య, ఆశా కార్యకర్తలు, ఏఎన్ ఎంల వద్ద ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. 

వీరిపైనే అధిక ప్రభావం .. 

జిల్లాలో గతంలో ఎన్నడులేని విధంగా ఈ ఏడాది మే నెలకు ముందే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదువు తున్నాయి. ఏప్రిల్లోనే ఎండలు భగ్గుమంటున్నాయి. దీంతో జనం అల్లాడిపోతున్నారు. ప్రధానంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు, రైతులు, కార్మికులు ప్రత్యేకించి భవన నిర్మాణ రంగంలో పనిచేసే వారిపై భానుడి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశముంది.

ఈ మేరకు వారంతా అప్రమ త్తంగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. వీలైనంత వరకు ఎండలో వెళ్లకపోవడమే మంచిదని పేర్కొంటున్నారు. అత్యవసరమై బయటకు వెళ్తే గొడుగు, టోపీ, రుమాలు వంటివి ధరించాలని, సాధ్యమైనంత ఎక్కువ నీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు. 

ఎక్స్ గ్రేషియా రూ.4లక్షలకు పెంపు.. 

వడదెబ్బతో మృతి చెందే బాధిత కుటుంబాలకు గతంలో ఆపద్భాంధు పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.50 వేల సాయం అందించేది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పరిహారాన్ని రూ.4 లక్షలకు పెంచింది. అయి తే 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన సందర్భాల్లోనే వడదెబ్బ మరణాలుగా పరిగణించను న్నారు. వడదెబ్బ, వేడిగాలులతో మరణం సంభవిస్తే సంబంధిత మెడికల్ ఆఫీసర్, తహసీల్దార్, పోలీస్ అధికారి(ఎస్త్స్ర ర్యాంకు కు తగ్గకుండా ఉండే)తో కూడిన బృందం క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పరిశీలించాల్సి ఉంటుంది.

వడదెబ్బ మరణమే అని వారు నిర్ధారిస్తే మృతుడి కుటుంబీకుల్లో ఎవరికి ఆర్థికసాయం అందించాలో వివరాలు సేకరిస్తారు. అనంతరం వివరాలతో పాటు మృతుడి డెత్ సర్టిఫికెట్ ను సంబంధిత అధికారులకు నామినీ సమర్పించాల్సి ఉంటుం ది. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి, కలెక్టర్ ధ్రువీకరించిన తర్వాత బాధి త కుటుంబానికి పరిహారం మంజూరు చేస్తారు. అయితే మృతులు రైతుబీమాలో నమోదై ఉండి వడదెబ్బతో మరణిస్తే ఏ పథకం కింద ఎక్కువ ఆర్థికసాయం అందుతుందో దానినే అమలు చేయనున్నట్లుగా ప్రభుత్వం స్పష్టం చేసింది. 

అప్రమత్తతే శ్రేయస్కరం... 

వడగాలులు, వడదెబ్బ విపత్తును ఎదుర్కొనేందుకు పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బందికి శిక్షణనిచ్చాం. క్షేత్రస్థాయిలోనూ ఎండ నుంచి రక్షణ పొందేలా ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నాం. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను జిల్లాలోని అన్ని పీహెచ్సీలతో పాటు ఆశ, ఆరోగ్య కార్యకర్తల వద్ద అందుబాటులో ఉంచుతున్నాం. ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించినట్లయితే వడదెబ్బ బారిన పడకుండా ఉండవచ్చు.

 గాయత్రీదేవి, 

ఇంచార్జి డీఎంహెచ్వో, సంగారెడ్డి