27-03-2025 01:17:25 AM
కలెక్టర్ కోయ శ్రీహర్ష
మంథని, ముత్తారం, కాల్వ శ్రీరాంపూర్, మార్చి 26 (విజయక్రాంతి) : జిల్లాలో రెవెన్యూ విధులను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ మంథని, ముత్తారం, కాల్వ శ్రీరాంపూర్ మండలాలలో విస్తృతంగా పర్యటించారు.
మంథని మండలం లోని రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం, నిర్మాణం అవుతున్న నూతన పురపాలక భవన పనులను, ముత్తారం మండలంలోని ధర్యాపూర్ గ్రామంలోని ఆదర్శ పాఠశాలను, వసతి గృహం, అక్కడ ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. మంథని రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ జాతీయ రహదారి 163 జీ క్రింద ముత్తారం మండలం లక్కారం గ్రామంలో సేకరించిన భూములలో ఉన్న నిర్మాణాలకు సంబంధించిన నగదు నిర్వాసితులకు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని, బోరు బావులు, చెట్లు, ఇతర నిర్మాణాలకు పరిహార నిధులు ప్రతిపాదనలను సంబంధిత అధికారులు వెంటనే జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్ కు పంపి త్వరగా మంజూరు అయ్యేలా చూడాలని కలెక్టర్ తెలిపారు.
డివిజన్ పరిధిలో భూ శుద్దీకరణ సమయంలో జరిగిన తప్పుల సరి చేసే ప్రక్రియ వేగవంతం చేయాలని, నీటిపారుదల శాఖ అధికారులు సర్వే రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ చెరువుల ఎఫ్టిఎల్, బఫర్ జోన్ పరిధి నిర్ధారించాలని కలెక్టర్ ఆదేశించారు. చెరువు భూములలో ఆక్రమణలు ఎక్కడైనా జరిగితే వెంటనే రికవరీ చేయాలన్నారు. ప్రభుత్వ భూముల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ భూములకు వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
మంథని పట్టణంలో నిర్మాణం అవుతున్న నూతన పురపాలక భవనం పనులు నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయానికి వచ్చే రోడ్డు అభివృద్ధి పనులను చేపట్టాలని, రోడ్డుకు ఇరువైపులా గ్రీనరీ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధర్యాపూర్ ఆదర్శ పాఠశాల వసతి గృహాన్ని కలెక్టర్ సందర్శించి పిల్లల డార్మెంటరీ, భోజనశాల, వంటగది పరిశీలించారు.
పిల్లలకు అందుతున్న భోజనం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆదర్శ పాఠశాలలో ఏర్పాటుచేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ముత్తారం మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన భూ సేకరణ పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, ఆన్ లైన్ దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ కాల్వ శ్రీరాంపూర్ మండల హెడ్ క్వార్టర్ లో ఉన్న ప్రభుత్వ భూములను సందర్శించారు, ప్రభుత్వ భూములు ఎక్కడైనా కబ్జాకు గురైతే వెంటనే విడిపించాలని, కబ్జాదారుల చెర నుంచి భూమి తొలగించి ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తహసిల్దార్ ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మంథని రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, మంథని తహసిల్దార్ గిరి, ముత్తారం ఎంపీడీవో సురేష్, ఎంపీఓ గోవర్ధన్, కాల్వ శ్రీరాంపూర్ తహ సిల్దార్ జగదీశ్వర్ రావు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.