పెద్దపల్లి (విజయక్రాంతి): సింగరేణి క్రింద చేపట్టాల్సిన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం అదనపు కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో సింగరేణి ఆర్జి 2, ఆర్జి 3, ఎన్టిపిసి పరిధిలో పెండింగ్ భూసేకరణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. సింగరేణి ఆర్జి 1, ఆర్జి 2, ఆర్జి 3 పరిధిలోని పెండింగ్ భూసేకరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఆర్జీ 3 పరిధిలో ఉన్న రామగిరి మండలం, బుధవారం పేట గ్రామంలో సేకరించాల్సిన 88 ఎకరాల 20 గుంటల భూమికి సంబంధించి రైతులకు పరిహారం విషయంలో ఏదైనా సమస్య, ఇబ్బంది ఉన్నా, సర్వే సమయంలో ఏదైనా రైతు వివరాలు, భూమిలో చెట్లు స్ట్రక్చర్ వివరాలు రానిపక్షంలో సంబంధిత దరఖాస్తులు సమర్పించడానికి అవకాశం ఉందని అన్నారు.
పెద్దంపేట గ్రామంలో పెండింగ్ ఉన్న 1 ఎకరం 12 గుంటల భూమి భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో కలెక్టరేట్ జీ విభాగం సూపరింటెండెంట్ సునీత, సింగరేణి ఆర్జి 3 జనరల్ మేనేజర్ నారాయణ, ఆర్జి 2 జనరల్ మేనేజర్, రామగిరి తహసిల్దార్ రామ్ చరణ్, రెవెన్యూ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.