27-03-2025 12:27:08 AM
రామాయంపేట మార్చి 26 (విజయ క్రాంతి)రామాయంపేట మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మెదక్ ఆర్డీవో రమాదేవి బుధవారం నాడు మండల సిబ్బందితో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు కుల, ఆదాయ, ధ్రువీకరణ పత్రాలు దరఖాస్తు చేసుకున్న వారికి ఎప్పటికప్పుడు అందించాలని తెలిపారు.
అదేవిధంగా మండల వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ దరఖాస్తు చేసుకున్న లబ్దిదారుల వివరాలు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి కళ్యాణ లక్ష్మి దరఖాస్తులు ఎలాంటివి పెండింగ్ లో ఉండకుండా చూడాలని పేర్కొన్నారు. ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో వస్తున్నటువంటి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు.
ప్రజల సమస్యల పరిష్కారం దిశగానే మండల సిబ్బంది అధికారులు 24 గంటలు పనిచేయాలని సూచించారు. అనంతరం ఆమె తహశీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సూచనల మేరకు ‘నో హెల్మెట్ నో ఎంట్రీ పై ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కార్యాలయానికి వచ్చే దరఖాస్తుదారులకు తాగునీటి సౌకర్యార్థం చలివేంద్రాన్ని ఆర్డీవో రమాదేవి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ రజనీకుమారి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.