12-04-2025 09:55:29 PM
గ్రామదేవతలకు బోనాల సమర్పణ..
కొల్చారం (విజయక్రాంతి): అమ్మ మమ్మల్ని చల్లంగా చూడమ్మా గ్రామదేవతలకు బోనాలు సమర్పించిన ముదిరాజ్ సంఘ సభ్యులు. మండల పరిధిలోని పోతంశెట్టిపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా శనివారం నాడు నల్ల పోచమ్మ, ముత్యాలమ్మ, దేవతలకు బోనాల ఊరేగింపు నిర్వహించి అమ్మవార్లకు సమర్పించారు. ముదిరాజ్ సంఘ సభ్యులు ప్రతి ఇంటి నుండి బోనాలను అలంకరించి భాజా భజంత్రీలతో శివసత్తుల నృత్యాలతో పోతురాజుల గావు కేకలతో గ్రామ కూడళ్లలో ఊరేగింపు నిర్వహించి నల్ల పోచమ్మ, ముత్యాలమ్మ, ఆలయాల వరకు చేరుకొని అమ్మవార్లకు సమర్పించారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొరబోయిన మంజుల కాశీనాథ్, మాజీ సర్పంచ్ గడ్డమీది నాగరాణి నర్సింలు, మాజీ ఎంపిటిసి సభ్యులు సాయిని భాగ్యలక్ష్మి సిద్ధిరాములు, గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గడ్డమీది శ్రీనివాస్, ముదిరాజ్ సంఘ సభ్యులు పులబోయిన నర్సింలు, యాదగిరి, సేవకులు, శివ, శ్రవణ్, కిష్టయ్య, మహిళలు గ్రామస్తులు బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.