17-04-2025 07:07:27 PM
కాటారం/మహా ముత్తారం (విజయక్రాంతి): మహముత్తారం మండలం బోర్లగూడెంలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్లితే బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బోర్లగూడెం ఊరుకుంట వద్ద బూడిద గుమ్మడికాయలు కొట్టి వాటిపై కుంకుమ పోసి అక్కడ క్షుద్ర పూజలు నిర్వహించారు. గ్రామపంచాయతీ రోడ్డు నుండి గాజారాం పల్లి వెళ్లే మూడు రోడ్లు కలిసే చోట గుమ్మడి కాయలు, కొబ్బరికాయలు తదితర పూజా సామాగ్రి అక్కడ వదిలి వెల్లారు. చూడగానే ఒల్లు గగుర్పొడిచే విదంగా భయంకరంగా ఉండడంతో గురువారం తెల్లవారుజామున కాలకృత్యాలకు అటువైపు వెళ్ళిన వారు భయాందోళనలకు గురయ్యారు. అటువైపు రాకపోకలు సాగించేందుకు గాజరాంపల్లి బోర్లుగూడెం గ్రామాల ప్రజలు జంకుతున్నారు. కాగా ఇదివరకు రెండు సార్లు కోడిగుడ్లు తదితర వస్తువులను ఈ రకంగానే పూజలు నిర్వహించి అక్కడే వదిలి వెళ్లినట్లు గ్రామస్థులు తెలిపారు. ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి దించిపోశారా లేదా గుప్తనిధుల కోసం ఎవైనా క్షుద్రపూజలు చేస్తున్నారా? మంత్రాలు నేర్చుకోవాలి అనే నెపంతో ఎవరైనా ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారా అని పలువురు చర్చించుకుంటున్నారు.