10-02-2025 12:30:21 AM
కోల్కతా, ఫిబ్రవరి 9: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ఫుల్ జోష్లో ఉంది. ఈ నేపథ్యంలో బెంగాల్ బీజేపీ అగ్రనేత సువేందు అధికారి సీఎం మమతా బెనర్జీని టార్గెట్ చేసి మాట్లాడుతూ..“ఇక మీ వంతే” అని హెచ్చరించారు. కోల్కతాలో ఆదివారం సువేందు మాట్లాడుతూ..ఢిల్లీలో ఘన విజయం సాధించామని, 2026లో బెంగాల్ వంతు అన్నారు.
ఢిల్లీ దేశ రాజధాని అని, దీనిని అంతర్జాతీయ నగరంగా మార్చాల్సి ఉందని, అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీని నాశనం చేసిందని సువేందు ఆరోపించారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి ఢిల్లీలోని 90శాతం బెంగాలీ ఓటర్లు బీజేపీకి అనుకూలంగా ఓటేశారని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీలోని బంగ్లాదేశ్, రోహింగ్యా చొరబాటుదారులకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఆధార్, ఓటర్ ఐడీ ఇవ్వడం ద్వారా ఉచిత విద్యుత్, నీరు వంటి సౌకర్యాలను అందించిందని, ఇది దేశ భద్రతకు ముప్పు అని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఇలాంటి కార్యకలాపాలకు మద్దతు ఇచ్చినట్లే, ఢిల్లీలో జరిగిన అన్ని దేశ వ్యతిరేక కార్యకలాపాలలో కేజ్రీవాల్ పాత్ర ఉందని సువేందు ఆరోపించారు.