హస్మత్ పేట కూలీల పిటిషన్లపై హైకోర్టు
హైదరాబాద్ , అక్టోబర్ 3 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాలానగర్ మండలం హస్మత్పేట హరిజన బస్తీ వాసులకు తహసీల్దార్ జారీచేసిన నోటీసులను హైకోర్టు కొట్టివేసింది. ఎలాంటి వివరాలు లేకుండా, బస్తీవాసుల వాదన వినకుండా జారీ చేసిన నోటీసులు చెల్లవని, పూర్తి వివరాలతో బస్తీవాసులు వాదన విని చట్టప్రకారం ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
ఎఫ్టీఎల్లోని ఇండ్లు తొలగించాలని ఆగస్టు 21న తహసీల్దార్ జారీచేసిన నోటీసులను రద్దు చేయాలని హరిజన బస్తీకి చెందిన ఎస్ మల్లయ్య మరో 9 మంది దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ చేపట్టారు. తహసీల్దార్ జారీచేసిన నోటీసుల్లో సర్వే నంబర్, ఆక్రమణల విస్తీర్ణాలను పేర్కొనలేదని, పూర్తి వివరాలు లేకుండా ఇచ్చిన నోటీసులు చెల్లవని ప్రకటించారు. చట్టం ప్రకారం పిటిషనర్ల వాదన విని తాజాగా చర్యలు చేపట్టవచ్చని తెలిపారు.