29-04-2025 01:35:31 AM
సినిమా ప్రతినిధి, (విజయక్రాంతి): మలయాళ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. మాలీవుడ్ కు చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ షాజీ కరుణ్ (73) కన్నుమూశారు. కొన్నేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. సినిమాటోగ్రాఫర్గా కెరీర్ ప్రారంభించిన షాజీ.. దర్శకుడిగా పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు.
'పిరవి', 'స్వాహం', 'వానప్రస్థం', 'నిషాద్', 'కుట్టిశృంఖు', 'స్వప్నం' వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలెన్నో ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకొని ప్రేక్షకాదరణ పొందినవే. మోహన్ లాల్ కథానాయకుడిగా నటించిన ‘వానప్రస్థం’ సినిమా షాజీ కరుణ్కు డైరెక్టర్గా మంచి పేరు తీసుకొచ్చింది. అంతేకాదు, షాజీ దర్శకత్వం వహించిన ‘పిరవి’ చిత్రం ఆయనకు ఏకంగా జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది.
షాజీ కరుణ్ను భారత ప్రభుత్వం 2011లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. షాజీ కరుణ్ మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు తమ సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ సామాజిక మాద్యమాల వేదికగా పోస్టులు పెడుతున్నారు.