కౌడిపల్లి, సెప్టెంబర్ 17: విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వైద్య సిబ్బందిని సస్పెండ్ చేస్తూ మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం కలెక్టర్ కౌడిపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా సంబంధిత సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించగా మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు కె.రమేశ్, రాధాకృష్ణ, ఎంపీహెచ్ఈవో అబ్దుల్ షకీల్ రిజిష్టర్లో సంతకాలు చేసి విధులకు గైర్హాజరయ్యారని తెలుసుకున్న కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తదనంతరం ముగ్గురిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిని ఉపేక్షించేది లేదని అన్నారు.