calender_icon.png 10 October, 2024 | 3:50 PM

పండుగ వేదికలపై రాజకీయ ప్రసంగాలు వద్దు

10-10-2024 01:21:08 PM

వైభవంగా దసరా ఉత్సవాలు జరుపుకుందాం 

రాజకీయాలకు అతీతంగా ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలి

విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): పండుగల వేదికలపై రాజకీయ ప్రసంగాలు ఉండకుండా చూడవలసిన బాధ్యత ఎంతైనా ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ & బి అతిథి గృహం లో ఈరోజు నిర్వహించిన దసరా ఉత్సవ కమిటీ పత్రికా సమావేశంలో ఆయన పాల్గొని రాజకీయాలకు అతీతంగా ఈ మారు దసరా పండుగ ఉత్సవాలు జరుపుకుందమని పేర్కొన్నారు. దసరా ఉత్సవాలకు ఓ ప్రత్యేకత సంతరించుకుందని, ఎన్నో సంవత్సరాలుగా జిల్లా పరిషత్ మైదానంలో దసరా ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించేవారమని, ఈ ఉత్సవాలలో ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహించడం, బాణాసంచా కాల్చడం జరిగేదన్నారు.

జిల్లా పరిషత్ మైదానంలో నూతనంగా నిర్మిస్తున్న ఆసుపత్రి పార్కింగ్ ఏరియా కావడమే కాకుండా అక్కడ నిర్మాణపు పనులు జరుగుతున్న సందర్భంగా గత సంవత్సరం నుంచి ఈ వేడుకలు జిల్లా పరిషత్ మైదానంలో జరుపడం లేదని ఆయన చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, తొక్కిసలాట లాంటివి జరుగకుండా, విశాలమైన ప్రాంగణంలో దసరా ఉత్సవాలు జరుపుకోవాలని దసరా ఉత్సవ కమిటీలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆ నిర్ణయానికి కట్టుబడి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఈ దసరా ఉత్సవాలు  నిర్వహిస్తున్నామని, ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ, మున్సిపాలిటీ సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఘనంగా దసరా ఉత్సవాలు జరిగేందుకు ఏర్పాట్లు చేస్తారని చెప్పారు.

అతిథులు ఎవరు కూడా వేదిక మీద రాజకీయ ప్రసంగాలు చేయకుండా సూచించాలని కోరారు.  సమన్వయంతో ఉత్సవాలు వైభవంగా జరిగేందుకు సహకరించాలని, ధార్మిక కార్యక్రమాల్లో ఏ వ్యక్తి, ఏ రాజకీయ పార్టీ ప్రమేయం ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ దసరా ఉత్సవాలు కొత్త ఒరవడికి నాంది పలకాలని ఆకాంక్షించారు. అనంతరం దసరా ఉత్సవాలు పోస్టర్ ను  ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో  మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, బురుజు సుధాకర్ రెడ్డి, డాక్టర్ మురళీధర్ రావు, చంద్రయ్య ,కె.ఎస్ రవికుమార్, అంజయ్య, సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, మోహన్ యాదవ్, మాల్యాద్రి రెడ్డి , లక్ష్మికాంత్ సారంగి, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.