- శివాజీ విగ్రహ రూపశిల్పి జయదీప్ ఆప్టే
- మురికి రాజకీయాలతోనే లొంగిపోయానని వెల్లడి
ముంబై, సెప్టెంబర్ 6: మహారాష్ట్రలోని థానే జిల్లా రాజ్కోట్లో ఆవిష్కరించిన 9 నెలలకే శివాజీ విగ్రహం ఇటీవల కుప్పకూలిన ఘటన అధికార, విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారితీసింది. ఈ క్రమంలో ఆ విగ్రహ రూపశిల్పి జయదీప్ ఆప్టే బుధవారం పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ‘తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తన భార్యతో చెప్పగా ఆమె తనను పోలీసుల ఎదుట లొంగిపోవాల్సిందిగా చెప్పింది. ఆమె సూచన మేరకు తాను పోలీసుల ఎదుట సరెండర్ అయ్యాను’ అని ఆప్టే వెల్లడించాడు.
కాగా ఇదే కేసుకు సంబంధించి అరెస్టున నిర్మాణ కాంట్రాక్టర్ చేతన్ పాటిల్ కస్టడీని మాల్వాన్లోని కోర్టు సెప్టెంబర్ 10వరకు పొడిగించింది. అయితే రాజ్కోట్లోని శివాజీ విగ్రహానికి సంబంధించిన ప్రాజెక్టుకు రూ.236 కోట్లు కేటాయి ంచినా విగ్రహ నిర్మాణాన్ని నాణ్యతా ప్రమాణాలతో నిర్మించలేదని, కాంట్రాక్టర్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే ఆరోపించారు. శివాజీ విగ్రహం కూలిపోవడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, బాధ్యులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే తెలిపారు. ఈ అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.