calender_icon.png 26 October, 2024 | 9:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

షరతులు వద్దు

14-09-2024 12:57:43 AM

  • తెలంగాణకు తక్షణమే ఆర్థిక సాయం అందించండి
  • వరదల నష్టం రూ.10,320 కోట్లు
  • ఆర్‌అండ్‌బి, పీఆర్ రోడ్ల నష్టమే రూ.7,693 కోట్లు
  • కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
  • సీఎంతో భేటీ అయిన కేంద్ర బృందం

హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): భారీ వర్షాలు, వరదలతో నష్ట పోయిన తెలంగాణకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోమారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆపదలో ఉన్న ప్రజ లను ఆదుకునేందుకు ఎలాంటి షరతులు లేకుండా నిధులు విడుదల చేయాలని కోరారు. విపత్తు నిధుల వినియోగం విషయంలో కేంద్రం అమలుచేస్తున్న కఠిన మైన నిబంధనలు సడలించాలని అభిప్రాయపడ్డారు.

రాష్ర్టంలో వరదలతో వాటి ల్లిన నష్టాన్ని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర అధికారుల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రాష్ట్రంలో పరిస్థితిపై మాట్లాడారు.

ఇప్పుడున్న నిబంధనలు ప్రకారం తెలంగాణ రాష్ర్టం మొత్తం మునిగిపోయినా కూడా ఎన్డీఆర్‌ఎఫ్‌లో అందుబాటులో ఉన్న రూ.1,350 కోట్లల్లో ఒక్క రూపాయి కూడా రాష్ర్ట ప్రభుత్వం వాడుకునే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి కేంద్ర అధికారుల బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఒక కిలోమీటర్ రోడ్డు దెబ్బతింటే, కేవలం రూ. 1 లక్ష ఖర్చు చేయాలని నిర్ణయించారని.. దీంతో తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టే పరిస్థితి లేదన్నారు. రాష్ర్టంలో జరిగిన నష్టంతో పాటు ఇక్కడ అమల్లో ఉన్న ఎస్‌ఎస్‌ఆర్ రేట్ల వివరాలను కూడా కేంద్రానికి నివేదిస్తామని, వాటిని పరిశీలించి విపత్తు సాయం అందించాలని ముఖ్యమంత్రి అన్నారు. 

అపారనష్టం వాటిల్లింది

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ర్టంలో అపార నష్టం సంభవించిందని సీఎం వివరించారు. ఇప్పటి వరకు వివిధ శాఖల నుంచి అందిన సమగ్ర అంచనాల ప్రకారం రూ.10,320.72  కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉందన్నారు. వరదల ప్రభావం వల్ల రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయన్నారు. ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్ శాఖ రోడ్లు కలిపి రూ. 7,693. 53 కోట్ల మేర నష్టం జరిగిందన్నారు. ఇక పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో రూ. 1216.57 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు.

రూ. 231.13 కోట్ల మేర పంటలకు నష్టం జరిగిందన్నారు. మిషన్ భగీరథకు రూ. 331.37 కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం తెలిపారు. తనతోపాటు మంత్రులు, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించటంతో భారీగా ప్రాణనష్టం తగ్గిందని చెప్పారు. వేలాది ఇండ్లు దెబ్బతిన్నాయని, లక్షలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. పంట పొలాల్లో బండరాళ్లు, కంకర, మట్టి మేటలు వేయటంతో రైతులు కోలుకోలేనంత నష్టపోయారని చెప్పారు. చాలా చోట్ల రహదారులు, రోడ్లు, కల్వర్టులు,  చెరువులు కొట్టుకుపోవటంతో నష్టం ప్రాథమిక అంచనాలను మించిపోయిందని వివరించారు. 

మున్నేరుకు రిటెయినింగ్ వాల్ ద్వారానే శాశ్వత పరిష్కారం

ఖమ్మం పట్టణంలో మున్నేరు  వాగుతో ఉన్న వరద ముప్పును నివారించేందుకు  రిటైనింగ్ వాల్ నిర్మించడమే శాశ్వత పరిష్కారమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రిటెయినింగ్ వాల్ నిర్మాణానికి కేంద్రం తగినన్ని నిధులు కేటాయించేలా చూడాలని కోరారు. రాష్ర్ట ప్రభుత్వం తనవంతుగా నిధుల వాటాను భరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. రాకాసి తండా, సత్యనారాయణ తండాతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న తండాల ప్రజలను సమీపంలో సురక్షితంగా ఉండే ప్రాంతంలో ఇళ్లను కేటాయిస్తామని చెప్పారు. ఇండ్ల నిర్మాణాలకు అవసరమైన సాయం అందించాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. 

వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించిన తర్వాత ఆదుకోవటం కంటే, నివారించే చర్యలపై ఎక్కువ దృష్టి సారించాలని ముఖ్యమంత్రి అన్నారు. వర్షపాతం, హీట్ వేవ్ లాంటి వాతావరణ, పర్యావరణానికి సంబంధించిన విపత్తులపై వీలైనంత ముందుగా హెచ్చరికలు జారీ చేసేలా ఏర్పాట్లపై ఎక్కువగా దృష్టి సారించాలని  కేంద్ర బృందానికి ముఖ్యమంత్రి సూచించారు. భవిష్యత్తులో వరదలు వచ్చినప్పుడు ఆదుకునేందుకు, తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ర్టంలోని వివిధ జిల్లాల్లో ఉన్నపోలీసు బెటాలియన్లను ఉపయోగించుకుంటామని సీఎం తన ఆలోచనలను కేంద్ర బృందంతో పంచుకున్నారు. ప్రతి బెటాలియన్లో ఎంపిక చేసిన వంద మందికి ప్రత్యేక శిక్షణను అందిస్తామని అన్నారు. వారికి అవసరమైన పరికరాలు, శిక్షణ, నైపుణ్యం నేర్పేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ సాయం కోరుతున్నామని అన్నారు. 

మేడారం ప్రమాదం మైదాన ప్రాంతంలో జరిగి ఉంటే..

మేడారం అటవీ ప్రాంతంలో ఇటీవల టోర్నడో వల్ల దాదాపు 50 వేల ఎకరాల్లో చెట్లు నేలమట్టమైన సంఘటన  సమావేశంలో చర్చకు వచ్చింది. అటవీ ప్రాంతంలో జరిగినందున ఎలాంటి ముప్పు వాటిల్లలేదని, మైదానప్రాంతంలో జరిగితే భారీ ప్రమాదం వాటిల్లేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. దేశంలో ఇప్పటివరకు ఇలాంటి సంఘటన జరిగినట్లు తమ దృష్టికి రాలేదని కేంద్ర బృందం అభిప్రాయపడింది. అందుకే కేంద్రం నుంచి నిపుణుల బృందాన్ని పంపించి శాస్త్రీయంగా అధ్యయనం చేయించాలని ముఖ్యమంత్రి కోరారు.

అలాంటి సంఘటనలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా పరిశీలించాలని సూచించారు. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర అధికారుల బృందం రెండు బృందాలుగా విడివడి రెండు రోజులుగా ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించింది. భారీ వర్షాలతో వరదలతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించింది. ఎన్డీఎంఏ సలహాదారు కల్నల్ కేపీ సింగ్ సారథ్యంలోని ఈ బృందంలో శాంతినాథ్ శివప్ప, మహేష్ కుమార్, నాయల్ కాన్సన్, రాకేష్ మీనా, శశివర్ధన్ రెడ్డి ఉన్నారు.

ఈ నెల 8వ తేదీ నాటికి 

సంభవించిన నష్టం వివరాలు 

సెక్టార్ నష్టం 

(రూ. కోట్లలో)

ప్రాణాలు కోల్పోయిన 

28 మంది కుటుంబాలకు 

పరిహారం 1.40

గృహాలు 25.30

పశుసంవర్ధక శాఖ 4.35

మత్స్యశాఖ 56.41

వ్యవసాయం 231.13

రోడ్లు(ఆర్‌అండ్‌బి, పీఆర్) 7693.53

విద్యుత్ 179.88

పాఠశాలల భవనాలు 27.31

సాగునీటి పారుదల 483

తాగునీటి సరఫరా 

(మిషన్ భగీరథ) 331.37

పట్టణాభివృద్ధి 1216.57

పీహెచ్‌సీ, అంగన్‌వాడీ 

భవనాలు మొదలైనవి 70.47

మొత్తం 10320.72