నష్టం లేకుండా పూడికతీత చేపట్టండి
అందుకు కేంద్రం అనుమతులున్నాయి
సిల్ట్పై ఈ నెల 14 వరకు నివేదిక ఇవ్వండి
క్యాబినెట్ సబ్కమిటీ భేటీలో మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): ప్రాజెక్టుల పుడికతీతకు కేంద్రం అనుమతులు ఇచ్చిందని, ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా పర్యావరణ అనుమతులు అవసరం లేదని నీటిపా రుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని, ప్రాజెక్టులకు ఎటువంటి నష్టం జరగకుండా ఉండేలా పూడికతీత పనులు చేపట్టాలని అధికారులను ఆదే శించారు.
ప్రాజెక్టుల రక్షణలో రాజీ పడొద్దని, పూడికతీత సమయంలో సారవంతమైన మట్టి లభ్యత ఉంటే రైతాంగానికి ఉచితంగా ఇవ్వాలన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులలో పూడికతీత అంశంపై సచివాలయంలో శుక్రవారం మంత్రివర్గ ఉపసంఘం మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన సమావేశమైంది. కమిటీ సభ్యులు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సుజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సమావేశంలో పాల్గొన్నారు. పూడికతీత ద్వారా వచ్చిన మట్టి, ఇసుకను ప్రాజెక్టుల ఇతర నిర్మాణాలకు వినియోగించాలన్నారు.
ఈ అంశంపై ఈ నెల 14 నాటికి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం నీటిపారుదల శాఖ, మైన్స్, జియాలజీ విభాగాలు సమావేశమై ఒక నిర్ణయానికి రావాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల్లో విపరీతంగాపేరుకుపోయిన పూడిక వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెద్దఎత్తున తగ్గిపోతోందని, ఫలితంగా రైతులకు అనుకున్న ప్రకారం సాగునీటిని అందించే పరిస్థితి లేకుండా పోతోంద న్నారు. ఈ విషయంపై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశిం చారు. సమావేశంలో నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యాదాస్, కార్యదర్శి రాహుల్ బొజ్జా, సహాయ కార్యదర్శి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.